మహబూబ్ నగర్ : తెలంగాణలో దివ్యాంగులను అన్ని విధాలా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర క్రీడలు, సాంస్కృతిక , ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ మెట్టుగడ్డలో ఉన్న ప్రభుత్వ దివ్యాంగుల బాలుర వసతి గృహం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడక ముందు దివ్యాంగులకు ఆనాటి ప్రభుత్వాలు కేవలం రూ. 200 మాత్రమే అందజేసేవారని పేర్కొన్నారు.
కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత దివ్యాంగులకు రూ. 3,016 లు అందిస్తున్నారని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారని ఆయన వివరించారు. దివ్యాంగుల క్రీడలకు సైతం ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. వచ్చే ఏడాది నాటికి దివ్యాంగుల హోమ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.