జగిత్యాల : ముఖ్యమంత్రి కేసీఆర్కు దేవుడి ఆశీస్సులు ఉండడం వల్ల దేశంలో కూడా సుపరిపాలన అందించేందుకు శ్రీకారం చుట్టారని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మంగళవారం స్పీకర్ పోచారం కుటుంబ సభ్యులు, మంత్రి కొప్పుల ఈశ్వర్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం అనంతరం ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలనంతరం స్పీకర్ మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సేవకుడే కాకుండా దైవ సేవకుడు కూడా అని తెలిపారు. యాదాద్రి శ్రీలక్ష్మినరసింహ స్వామి ఆలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కే దక్కిందని అన్నారు. మూడు లక్షల టన్నులతో రూ. 1213 కోట్ల ఖర్చుతో యాదాద్రి ఆలయాన్ని పునర్న్మించారని కొనియాడారు.
కొండగట్టు అభివృద్ధికి వందకోట్లు నిధులు ఇస్తున్న సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆయన వెంట రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్, డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ఉన్నారు. కొండగట్టు పర్యటనలో భాగంగా కరీంనగర్కు వచ్చిన స్పీకర్ దంపతులను మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు మర్యాద పూర్వకంగా ఆహ్వానించి సన్మానించారు.