రాష్ట్రంలో చక్కెర కొరత తలెత్తకుండా చర్యలు
ప్లాంట్ల సామర్థ్యం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు
చక్కెర దిగుమతులు తగ్గినా ఇబ్బందిలేకుండా జాగ్రత్తలు
చెరుకు పంట సాగు పెంపుపైనా ప్రత్యేక దృష్టి
హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం రాష్ట్రంలో సాలీనా దాదాపు 5 లక్షల టన్నుల చక్కెర లోటు ఉన్నది. దీనిని పూడ్చుకొనేందుకు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఇథనాల్ లక్ష్యాన్ని చేరుకొనేందుకు ప్రస్తుతం ఆయా రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున ఇథనాల్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఏడాదిన్నరలో ఇవి ఉత్పత్తిదశకు చేరుకోనున్నాయి. అవి ఉత్పత్తి ప్రారంభిస్తే మన రాష్ర్టానికి చక్కెర దిగుమతులపై ప్రతికూల ప్రభావం పడనున్నది. దీనిని దృష్టిలో ఉంచుకొని మన రాష్ట్రంలోని చక్కెర పరిశ్రమల సామర్థ్యం పెంపుతోపాటు ఇందులో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు సంబంధిత శాఖ ప్రణాళికలు సిద్ధంచేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో డిస్టిలరీలు, ఔషధ పరిశ్రమల అవసరాలకు సరిపడా మొలాసిస్ ఉత్పత్తి అవుతున్నది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ర్టాలపై ఆధారపడకుండా 100 శాతం రాష్ట్ర అవసరాలు తీర్చేందుకు చక్కెర శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా ప్రస్తుత చక్కెర పరిశ్రమలను ఆధునికీకరించడం, వాటి సామర్థ్యాన్ని పెంచడంతోపాటు చెరుకు సాగును దాదాపు 50 వేల హెక్టార్లకు పెంచాలని నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం కూడా రాష్ట్రంలో చక్కెర పరిశ్రమ అభివృద్ధికి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. 2025 నాటికి పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలపాలని లక్ష్యంగా పెట్టుకొన్న కేంద్రం, ఇందుకోసం ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 900 కోట్ల లీటర్లకు పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున ఇథనాల్ తయారీ ప్లాంట్లు ఏర్పాటవుతున్నాయి. దీంతో అక్కడ చక్కెర ఉత్పత్తి తగ్గి రాష్ర్టానికి దిగుమతులు తగ్గే అవకాశమున్నదని అధికారులు తెలిపారు. దీంతో మన రాష్ట్రంలో చక్కెరకు కొరత ఏర్పడుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుంచే చక్కెరకు కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. దీనికి సంబంధించి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
చక్కెర కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు
రాష్ర్టానికి చక్కెర ఎగుమతి చేస్తున్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలు ఇథనాల్వైపు దృష్టి పెట్టడంతో రానున్న రోజుల్లో దాని ప్రభావం మన రాష్ట్రంపై పడే అవకాశమున్నది. దీనిని దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రణాళికలు రూపొందించాం. రాష్ట్రంలో చక్కెర ఉత్పత్తిని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వానికి నివేదించాం. ఇథనాల్ ఉత్పత్తికి సైతం రెండు కంపెనీలు ముందుకొచ్చాయి. రాష్ట్రంలోని చక్కెర పరిశ్రమల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు అవసరాలకు తగ్గట్టు చెరుకు దిగుబడిని కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది. అన్ని అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేశాం. త్వరలోనే తగు నిర్ణయం తీసుకొనే అవకాశమున్నది.
– భద్రూ మాలోత్, సంచాలకుడు, రాష్ట్ర చక్కెర శాఖ