ఆలస్య రుసుం రోజుకు రూ.50 నుంచి మినహాయింపు
2020 ఫిబ్రవరి 1 నుంచి 2021 అక్టోబర్ 31 వరకూ వర్తింపు
వాహనదారులకు ఊరట.. సర్కారుపై రూ.640 కోట్ల భారం
హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): వాహనదారులకు భారీ ఊరట లభించింది. వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు సకాలంలో చేయించుకోని వాహనదారులకు రోజుకు రూ.50 చొప్పున విధించే అదనపు రుసుంను ప్రభుత్వం రద్దు చేసింది. అన్ని రకాల వాహనాలకు ఇకపై ఎప్పుడూ లెవీ విధించవద్దని నిర్ణయం తీసుకొన్నది. అదేవిధంగా కరోనా నేపథ్యంలో 2020 ఫిబ్రవరి1 నుంచి 2021 అక్టోబర్ 31 మధ్య కాలానికి ఫిట్నెస్ చేయించుకోని వాహనదారులపై రోజుకు రూ.50 చొప్పున విధించిన ఆలస్య రుసుంను సైతం మినహాయిస్తున్నట్టు ప్రభుత్వ కార్యదర్శి కే శ్రీనివాసరాజు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
వాహనదారులకు.. ప్రధానంగా ఆటోలు, ఇతర రవాణా వాహనదారులకు భారీ ఊరటనిస్తూ మానవీయ కోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొన్న నిర్ణయంపై వాహన సంఘాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంతో లక్షల మంది డ్రైవర్లు, వాహనదారులకు ఉపశమనం లభించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
3.2 లక్షల వాహనదారులకు ఊరట
ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తం 3 లక్షల 20వేల మంది వాహనదారులకు ఊరట లభించింది. రోజుకు రూ.50 అదనపు రుసుం వల్ల ప్రభుత్వానికి దాదాపు రూ.640 కోట్ల ఆదాయం తగ్గనున్నది. అయితే, ఆర్థికంగా సతమతం అవుతున్న ఆటోడ్రైవర్లు, యజమానులకు కలిపి రాష్ట్రవ్యాప్తంగా లక్షకుపైగా మందికి ప్రభుత్వ నిర్ణయం ఊరటనిచ్చినట్టయింది. అ టు.. లేవీ ఇబ్బందులు ఉండవని, కేవలం ఫిట్నెస్ రుసుం చెల్లించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు చేయించుకోవాలని వాహనదారులకు ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో భారీ ఊరట
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొన్న ఈ నిర్ణయం హర్షణీయం. ఎంతో మంది వాహనదారులకు ఊరట లభించింది. అదనపు రుసుం లేదు కాబట్టి వాహనదారులు తమ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు వెంటనే చేయించుకోవాలి.
– డాక్టర్ పాపారావు, అధ్యక్షుడు, తెలంగాణ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అసోసియేషన్
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని బీపీటీఎంఎం తరఫున స్వాగతిస్తున్నాం. ఈ అవకాశాన్ని డ్రైవర్లు, వాహన యజమానులు సద్వినియోగం చేసుకోవాలి. విధిగా అంతా వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోవాలి.
– రవిశంకర్ అల్లూరి, జాతీయ ప్రధాన కార్యదర్శి, భారతీయ ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ (బీపీటీఎంఎం)