దుబ్బాక, ఆగస్టు 27: సబ్బండ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు కృత నిశ్చయంతో పని చేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. పేద కుటుంబాలకు పెద్దన్నలా.. వృద్ధులకు పెద్ద కొడుకులా సీఎం కేసీఆర్ అండగా ఉంటూ ఆసరా పింఛన్లు అందజేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట మండలాల్లో మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ సిద్దిపేట అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి లబ్ధిదారులకు నూతన ఆసరా పింఛన్కార్డులను పంపిణీ చేశా రు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీమాం ధ్ర ప్రభుత్వాల హయాంలో పింఛన్లు ఎలా ఉండేవని ప్రజలను ప్రశ్నించారు. ఎవరైనా చనిపోతే, వారి స్థానంలో కొత్త పింఛన్లు వచ్చేవని, అది కూడా 3,4 నెలలకు అని గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వంలో నెలకు రూ.50 పింఛన్ ఇచ్చేదని, కాంగ్రెస్ హయాం లో రూ.200 వచ్చేదని చెప్పారు. బీడీ, చేనేత, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు పింఛన్ వచ్చేది కాదని పేర్కొన్నారు.
తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పథకం ద్వారా దివ్యాంగులకు రూ.3 వేలు, వృద్ధాప్య, బీడీ, నేత, గీత కార్మికులు, హెచ్ఐవీ, బోధ రోగులకు, ఒంటరి మహిళలకు నెలకు రూ.2వేల పదాహారు అందిస్తున్నట్లు స్పష్టంచేశారు. దేశంలో ఎక్కడలేని విధంగా ఆసరా పథకాన్ని అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభు త్వం, సీఎం కేసీఆర్కే దక్కిందని హరీశ్రావు అన్నారు.
స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ వృద్ధాప్య పింఛన్ అర్హతను 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించి పేదల ముఖాల్లో ఆనందం నింపారని తెలిపారు. తిన్న రేవును తలువాలని, అన్నం పెట్టిన చేతిని మరువద్దని, ఆసరా పింఛన్ ఇచ్చి అండగా నిలిచిన సీఎం కేసీఆర్ను గుండెల్లో పెట్టుకుని, గుర్తుంచుకోవాలని సూచించారు. నూతనంగా ఆసరా పింఛన్లు అందుకుంటున్న వారందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, యాదవరెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్రావు, మున్సిపల్ చైర్పర్సన్ వనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 27: కొత్త పింఛన్ మంజూరు పత్రాలను స్పీకర్, మంత్రులు ఆయా జిల్లాల్లో లబ్ధిదారులకు అందజేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 1,201 మందికి మంజూరైన పింఛన్ కార్డులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్, దుర్శేడ్, గోపాల్పూర్లో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ లబ్ధిదారులకు పింఛన్ కార్డులను ఇచ్చారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్, సూర్యాపేటలో విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి పంపిణీచేశారు. మహబూబాబాద్ జిల్లా కేం ద్రంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ కొత్త పింఛన్ కార్డులను అందజేశారు.