Pension for Handicapped | హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ను రూ.1000 పెంచుతూ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు దివ్యాంగులకు రూ.3116 పెన్షన్ ఇస్తుండగా, దానిని రూ.4116కు పెంచుతున్నట్టు శుక్రవారం మంచిర్యాల బహిరంగ సభలో ప్రకటించారు. ఈ పెన్షన్ వచ్చే నెల నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. దేశాన్ని, రాష్ర్టాన్ని 60 ఏండ్ల పాలించిన కాంగ్రెస్ ఏ ఒక్కరికీ మంచి చేయలేదని, ఇప్పుడు మళ్లీ వచ్చి కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారని విమర్శించారు. ఎలాంటి వివక్ష లేకుండా అందరి సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. ‘పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నేడు అంతా సంక్షేమమే. కాంగ్రెస్ వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని బహిరంగంగానే చెప్తున్నారు. అటువంటి కాంగ్రెస్కు అవకాశమిస్తే తెలంగాణలో మళ్లీ దళారీల రాజ్యం, పైరవీకారుల రాజ్యం, పైసలు గుంజేటోళ్ల రాజ్యం వస్తది’ అని ప్రజలను హెచ్చరించారు.
కాంగ్రెస్ను బంగాళాఖాతంలో విసిరెయ్యండి
ధరణిలోకి 1.55 కోట్ల ఎకరాలు ఎక్కిందని, ఇంకో ఐదు నుంచి పది లక్షల ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. గతంలో పహణీ ఎక్కాలన్నా, పట్టాలు చేయాలన్నా అధికారం వీఆర్వో, ఎమ్మార్వో, ఆర్డీవో దగ్గర ఉండేదని, నేడు ధరణితో ఆ అధికారాన్ని రైతులకే అప్పగించామని తెలిపారు. ‘ఇవాళ మళ్లీ ఎన్నికలు రాగానే అంగడి మొదలైంది. ధరణిని బంగాళాఖాతంలో పడేస్తమని కాంగ్రెస్ బాహాటంగానే చెప్తున్నది. బంగాళాఖాతంలో ధరణిని ఇసిరేస్తారో? లేకపోతే రైతులనే ఇసిరేస్తారో? ఆలోచించాలి. మూడేండ్లు కష్టపడి అందరినీ ఒప్పించి, మెప్పించి చెమటోడ్చి ధరణి పోర్టల్ తీసుకొచ్చాను. ధరణి పుణ్యమా అని ఎవరి భూమి వాళ్లకే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వచ్చి ధరణిని తీసేస్తే మళ్లీ వీఆర్వోలు, పట్వారీల రాజ్యం వస్తుంది. ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామంటున్నవారినే గిరగిరా తిప్పి బంగాళాఖాతంలో పడెయ్యాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.