నకిరేకల్, మే 28: ప్రభుత్వ విప్, నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్ప ఇటీవల ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సదరు విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. “ఆనాడు కేసీఆర్ సార్ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల రాసముద్రంలో మిషన్కాకతీయ పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా పన్నాలగూడెంలో ఉన్న తన పాత ఇంటికి కేసీఆర్ వచ్చారు. ఆ సమయంలో ఆయనకు అన్నం పెట్టాను.. అన్నం పెట్టిన తర్వాత సార్ తెలంగాణ ఉద్యమంలో 16 మంది పిల్లలు జైలుకుపోయి చిత్రహింసలకు గురైన్రు. వారికి ఉద్యోగాలు ఇప్పిం చండి సార్ అని అడిగిన. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ ఉన్నా పక్కనే కూర్చోబెట్టుకొని చెప్పమ్మా అని అడిగిండు.. నాకు చానా గుర్తుంది.
మరి నీ ఉద్యోగం సంగతి ఏందీ అని అడిగినప్పుడు ఎవరూ మాట్లాడటం లేదు. ఫస్టు లిస్టులో నా పేరు వచ్చినప్పుడు చింపేశారు అని చెప్పిన. దానికి కేసీఆర్ సార్ బదిలిస్తూ.. చందుపట్ల దగ్గర అందరికీ అన్నం పెట్టింది.. ఆడిందీ.. పాడిందీ అందరికంటే ముందే వచ్చి.. చాయ్ ఇచ్చింది ఈమె కదా.. ఆమెను పాటలు పాడొద్దనే హక్కు ఎవరికీ లేదు.. బతికున్నంత వరకూ పాటలు పాడుతుందంటూ అందరి ముందు కేసీఆర్ సార్ చెప్పిండు.. పాత ఇంట్లో అందరి ఎదుట 16మందితో ఉన్న లెటర్పై నా పేరు కూడా చేర్చి సంతకం పెట్టిండు..
16మందితోపాటు నాకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు అని గుర్తు చేసుకున్నది. అలా తనకు ఉద్యోగం వచ్చిందని.. అప్పుడు రూ.32 వేల జీతమంటే మామూలు విషయం కాదని, అవి పాకెట్ మనీ కంటే చాలా ఎక్కువ అని సంతోషం వ్యక్తంచేసింది. అయితే ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండగా, కేసీఆర్ సార్ అంటే ఏంటో మరోసారి ఈ వీడియో ద్వారా అర్థమైందని పలువురు పేర్కొంటున్నారు.