హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): నరంలేని నాలుక నలభై రకాలుగా మాట్లాడుతది అన్నట్టుగా ధాన్యం సేకరణపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. రైతులను నిండా ముంచడమే లక్ష్యంగా రోజుకో హామీ ఇస్తున్నారు. ధాన్యం సేకరణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు బండారం బయటపడటంతో ఇప్పుడు మరో వితండ వాదం ఎత్తుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. యాసంగిలో నాటే వరి రకాలను మార్చితే బాయిల్డ్ రైస్ సమస్య ఉండదని రైతులకు ఆయన ఉచిత సలహా ఇచ్చారు. రా రైస్ ఎంత ఉత్పత్తి అయినా కేంద్రంతో కొనిపిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఇప్పటికే ఎఫ్సీఐ వద్ద 229 లక్షల టన్నుల రా రైస్, 254 లక్షల టన్నుల ధాన్యం నిల్వలున్నాయని కేంద్రమే ప్రకటించింది. ఈ సీజన్లో సేకరిస్తున్న ధాన్యం, బియ్యం అందుకు అదనం. అంటే కేంద్రం లెక్కల ప్రకారం ఎఫ్సీఐ వద్ద అవసరానికి మించి మూడురెట్లు అధికంగా నిల్వలున్నాయి. ఈ లెక్కన సమీప భవిష్యత్తులో ఎఫ్సీఐ రా రైస్ను కూడా తీసుకొనే పరిస్థితి లేదని నిపుణులు అంటున్నారు. అలాంటప్పుడు బండి సంజయ్ కేంద్రంతో రా రైస్ను ఎలా కొనిపిస్తారని నిలదీస్తున్నారు. బండి సంజయ్ మాటలు నమ్మి యాసంగిలో ఇతర పంటలకు బదులు వరినే సాగుచేసిన పక్షంలో పంట చేతికొచ్చిన తర్వాత తీరా ధాన్యం తీసుకోమని కేంద్రం మొండికేస్తే రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ధాన్యాన్ని బండి సంజయ్ కొంటారా? అని నిలదీస్తున్నారు. అసలు బండి మాట ఢిల్లీలో చెల్లుబాటు అవుతుందా? అని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. చెల్లని కాసులాంటి బండిని నమ్మి నిండా మునుగాలా? అని మండిపడుతున్నారు. యాసంగి బియ్యం కొనిపిస్తానంటున్న బండి సంజయ్, వానకాలం పంటను ఎందుకు కొనిపించటంలేదని నిలదీస్తున్నారు. రాష్ట్రంలో ఈ వానకాలంలో కోటి టన్నుల రా రైస్ ఉత్పత్తి అవుతాయని అంచనా ఉన్నది. కేంద్రం మాత్రం 40 లక్షల టన్నులే కొంటామంటున్నది. మిగిలిన ధాన్యం సంగతి ఏమిటని బండిని రైతులు ప్రశ్నిస్తున్నారు.