KCR | హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): హోలీ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్య జీవనంలోని కష్టాలను కాసేపు మరిచి, వయోభేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి కేరింతలతో ఆనందోత్సాహాల నడుమ రంగులతో జరుపుకునే ప్రకృతి పండుగ హోలీ అని గుర్తుచేశారు.
ఈ పండుగ భారతీయ సామాజిక, సాంస్కృతిక జీవన ప్రత్యేకతను చాటుతుందని పేర్కొన్నారు. వసంతాన్ని తమ జీవితాల్లోకి ఆహ్వానిస్తూ జరుపుకునే హోలీ పర్వదిన సందర్భంగా ప్రకృతిమాత ప్రజలందరినీ చల్లగా చూడాలని కేసీఆర్ ప్రార్థించారు. హోలీ సందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ తదితరులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.