హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలు అంబరాన్ని అంటేలా నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. మంగళవారం నుంచి గురువారం దాకా మూడు రోజులపాటు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకొందామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నాయి. మంగళవారం నియోజకవర్గ కేంద్రాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, దవాఖానల్లో అన్నదానం, పండ్లు, దుస్తుల పంపిణీ కార్యక్రమాలు చేపడుతారు. బుధవారం రక్తదాన శిబిరాలు, కేసీఆర్ జన్మదినోత్సవమైన గురువారం (ఈ నెల 17న) న అన్ని ప్రార్థనా మందిరాల్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించనున్నారు. వీటితోపాటు టీఆర్ఎస్ కార్యకర్తలంతా వారి పరిధిలో తోచిన విధంగా గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో పాల్గొంటారు. వేడుకలకు తెలంగాణ భవన్ ఇప్పటికే ముస్తాబైంది. ఉద్యమ నాయకుడిగా వివిధ సందర్భాల్లో చేసిన ఉద్యమాలు, సీఎంగా చేపట్టిన కార్యక్రమాల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్ వివిధ కార్యక్రమాలకు ప్రణాళికలు వేశారు. 17న మంత్రి తలసాని సారథ్యంలో తెలంగాణ భవన్ను గులాబీ బెలూన్లు, పూలతో అలంకరించనున్నారు. సీఎం కేసీఆర్ జీవిత చరిత్ర వివరించే 3డీ గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్తో హిందీ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారు. సీఎం కేసీఆర్ ఉద్యమ చరిత్ర, సంక్షేమ పాలనను వివరించేలా రెండు డిజిటల్ డిస్ప్లే (ఫొటో బూత్)లను ఏర్పాటు చేయనున్నారు.
రైతు దినోత్సవంగా కేసీఆర్ జన్మదినం
సీఎం కేసీఆర్ జన్మదినమైన ఫిబ్రవరి 17ను రైతు దినోత్సవంగా నిర్వహించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించిందని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. వ్యవసాయ శాఖ, రైతు బంధు సమితి పిలుపు మేరకు రాష్ట్రంలోని 2,601 కస్టర్లలో ఉత్తమ రైతులను గుర్తించి, 17న రైతు వేదికల వద్ద సన్మానించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రతి రైతు తమ పంట పొలాలు, కల్లాల వద్ద కేసీఆర్ చిత్రపటాలకు ధాన్యాభిషేకం చేయాలని కోరారు. మూడు రోజలు నిర్వహించే వేడుకల్లో రైతులు పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యేలా రైతుబంధు కో ఆర్డినేటర్లు, కార్యకర్తలు చర్యలు తీసుకోవాలని సూచించారు.