హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను ఆదేశించారు. జర్నలిస్టుల ఇండ్లకు సంబంధించిన కేసు త్వరగా పరిష్కారమయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో విధానపరమైన కొత్త నిర్ణయాలు ఉంటే చర్చించి అమలుచేయనున్నట్టు పేర్కొన్నారు. అటార్నీ జనరల్ సూచించిన జాతీయ విధాన మార్గదర్శకాల నుంచి ప్రస్తుత కేసును విడదీయాలని సుప్రీంకోర్టుకు విన్నవించాలని సూచించారు. జర్నలిస్టుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు, వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పునరుద్ఘాటించారు.
కేసీఆర్కు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ కృతజ్ఞతలు
జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్ణయించడం పట్ల రాష్ట్ర హౌజింగ్ సొసైటీ చైర్మన్, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావుతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల హౌజింగ్ సొసై టీ కేసు సుప్రీం కోర్టులో ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్నదని, దీనిని త్వరితగతిన పరిష్కరించేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.