కాజీపేట, ఏప్రిల్ 23: కాజీపేట రైల్వే వ్యాగన్ తయారీ వర్క్షాపు, రైల్వే వ్యాగన్ పీవోహెచ్ షెడ్ విషయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్రెడ్డికి నిరసన సెగ తగిలింది. కేంద్రం తప్పును రాష్ట్ర సర్కారుపై నెట్టివేస్తారా? అంటూ రాకేశ్రెడ్డిని స్థానికులు, రైల్వే కార్మికులు నిలదీశారు. కాజీపేట రైల్వే వ్యాగన్ తయారీ వర్క్షాపు, రైల్వే వ్యాగన్ పీవోహెచ్ షెడ్ పనులకు కేంద్ర ప్రభుత్వం వెంటనే శంకుస్థాపన చేయాలని తెలంగాణ రైల్వే ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం కాజీపేట చౌరస్తాలో ధర్మ పోరాట దీక్షను నిర్వహించారు. ఈ దీక్షలో వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు పాల్గొన్నాయి.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్రెడ్డి మాట్లాడుతూ, రైల్వే వ్యాగన్ పీవోహెచ్ షెడ్కు రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకరాల భూమి ఇచ్చిందని, మిగతా 10 ఎకరాల భూమి ఇవ్వకుండా స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ కావాలనే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై తాము చాలాసార్లు లేఖలు రాసినా ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదని, అందుకే శంకుస్థాపన జాప్యం అమవుతున్నదని అన్నారు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు, రైల్వే కార్మికులు భగ్గుమన్నారు. 150 ఎకరాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. కేవలం 10 ఎకరాల భూమి ఇవ్వదా? అంటూ రాకేశ్రెడ్డిని నిలదీశారు. రాష్ట్ర సర్కారుపై తప్పును నెట్టి మీరు తప్పించుకోవాలని చూస్తున్నారా? అంటూ మండిపడ్డారు.
దీంతో బీజేపీ వర్గీయులు, స్థానికులు, రైల్వే కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ నాయకుడు జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కావాలనే రైల్వే వ్యాగన్ పీవోహెచ్ షెడ్కు శంకుస్థాపన చేయడం లేదని ఆరోపించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ వర్గీయుల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో పోలీసులు ఇరువర్గాలను దీక్షా శిబిరం నుంచి పక్కకు తప్పించారు. దీక్షను విరమించుకొంటున్నట్టు నిర్వాహకులు ప్రకటించడంతో పోలీసులు దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైల్వే ఎంప్లాయీస్ జేఏసీ కన్వీనర్, చైర్మన్ దేవులపల్లి రాఘవేందర్, కొండ్ర నర్సింగరావు మాట్లాడుతూ, రైల్వే వ్యాగన్ పీవోహెచ్ షెడ్ నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని కేంద్ర సర్కారును డిమాండ్ చేశారు.