కొండాపూర్, జూన్ 2: జాతీయ ఆరో గ్య మిషన్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో అందజేసే కాయకల్ప అవార్డుల్లో కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా దవాఖాన తెలంగాణలో ప్రథమ స్థానం సాధించగా, గజ్వేల్ దవాఖాన రెండో స్థానంలో నిలిచింది. ఉత్తమ వైద్య సేవలతోపాటు శుచి, శుభ్రతలో ఉత్తమ ప్రమాణాలు పాటించే దవాఖానలకు ఈ అవార్డును అందజేస్తారు. శుచి, శుభ్రతలో 2022-23 సంవత్సరంలో కొండాపూర్లోని జిల్లా దవాఖాన 92.13%తో మొదటి స్థానంలో నిలవగా, 87.47%తో గజ్వేల్ రెండవ స్థానంలో నిలిచింది.
దవాఖానలోని స్వచ్ఛత, రోగులకు, వారి అటెండెంట్లకు అందుతున్న సదుపాయాలు, బయో మెడికల్ వేస్టేజ్ నిర్వహణ, ఇన్ఫెక్షన్ సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు, పారిశుద్ధ్యం, రికార్డుల నమోదు, సిబ్బంది పనితీరు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని జాతీయ ఆరోగ్య మిషన్ బృందం స్కోరింగ్ ఇస్తుంది. ఈ అంశా ల్లో జిల్లా దవాఖాన రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం సంతోషంగా ఉన్నదని రంగారెడ్డి జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ వరదాచారి హర్షం వ్యక్తంచేశారు. కాయకల్ప అవార్డుల్లో ప్రథమ స్థానంలో నిలిచిన దవాఖానకు 50 లక్షలు, ద్వితీయ స్థానంలో నిలిచిన దవాఖానకు 20 లక్షలు అందజేస్తారు.
కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా దవాఖాన ఎకో ఫ్రెండ్లీ విభాగంలోనూ 93.57%తో మొదటి స్థానంలో నిలిచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల బహుమతిని గెలుచుకున్నది. సోలార్ ప్లాంట్లు, ఎల్ఈడీ బల్బుల వినియోగం, బయోమెడికల్ ఈ-వేస్ట్, నీళ్లు తదితర వాటిని వృధాగా పోనియకుండా రీయూజ్ ప్రక్రియను కొనసాగిస్తున్నట్టు వరదాచారి తెలిపారు.