హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్వే హత్యా రాజకీయాలని, 2018 ఎన్నికల్లో తనను హత్య చేయించడానికి ప్రయత్నించారని ప్రభుత్వ విప్ పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో అనేకమందిని హత్య చేయించిన చరిత్ర ఈటలదేనని విమర్శించారు. ఈటల అందరినీ మోసం చేశారని ఆయనను ఇకపై చీటర్ రాజేందర్గా పిలుస్తామని చెప్పారు. మంగళవారం ఆయన బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వీణవంక మండలం నర్సింగాపూర్కు చెందిన బాలరాజును హత్య చేయించలేదా? అని ప్రశ్నించారు. ఈటల మంత్రిగా ఉన్నప్పుడు పోలీసుల ద్వారా ప్రత్యర్థులను వేధించేవాడని ఆరోపించారు. ప్రవీణ్కుమార్పై థర్డ్ డిగ్రీ ప్రయోగించి గుండెపోటుతో చనిపోవడానికి ఈటల కారణం కాదా? అని నిలదీశారు. దళితుడు సంపత్ను వేధించి చనిపోయేలా చేశారని ఆరోపించారు. సమ్మయ్య, దశరథం ఇలా అనేకమందిని హత్య చేయించిన చరిత్ర ఈటలదేనని అన్నారు. తనను కూడా చంపించడానికి 2018 ఎన్నికల సమయంలో ప్రయత్నించారని అన్నారు. అప్పుడు తనపై, వాహనంపై జరిగిన దాడి చిత్రాలను చూపించారు. ఈటల ఓటమి భయంతో తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారనే అనుమానాన్ని పాడి కౌశిక్రెడ్డి వ్యక్తంచేశారు. ఈటలను చంపడానికి రూ.20 కోట్లతో ఒప్పందం చేసుకున్నానని ఆరోపించడం జోక్గా అభివర్ణించారు. అన్ని సర్వేల్లోనూ కౌశిక్రెడ్డి గెలుస్తున్నాడని తేలడంతో వారిలో ఫ్రస్ట్రేషన్ ఎక్కువైందన్నారు. ఈటల దంపతులు ప్రెస్మీట్లో అన్నీ అబద్ధాలే చెప్పారని దుయ్యబట్టారు.
బీసీలంటే చిన్న కులాలా..?
బీసీలను చిన్న కులాలు అంటూ ఈటల జమున సంబోధించడం వారిని అవమానించడమేనని పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. చిన్నకులం అనే పదం వాడటంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆమె తక్షణమే బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్లంటే చిన్నచూపుతోనే ఈటల భార్య తన కోడలిగా, అల్లుడిగా ముదిరాజ్ల పిల్లలను తెచ్చుకోలేదని విమర్శించారు. తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని, ఈటల సిద్ధమా? అని పాడి కౌశిక్రెడ్డి సవాల్ విసిరారు. ఒకప్పుడు ఇల్లు సరిగా లేని ఈటల రాజేందర్ ఇప్పుడు రూ.వందల కోట్ల ఇల్లు ఎలా కట్టుకున్నారని ప్రశ్నించారు. పది, పదిహేను కోట్ల రూపాయల కార్లు ఈటలకు ఎలా వచ్చాయని నిలదీశారు.
అమరుల స్థూపంపై తప్పుడు ప్రచారం
హుజూరాబాద్లో అమరవీరుల స్థూపాన్ని మున్సిపాలిటీ తీర్మానం మేరకు రోడ్డు విస్తరణలో భాగంగా కూల్చారని కౌశిక్రెడ్డి వెల్లడించారు. దానిని తానే కూల్చినట్టుగా తప్పుడు ప్రచారం చేయడం సరికాదని చెప్పారు. కొత్తగా అమరవీరుల స్థూపాన్ని నిర్మించామన్నారు.