సిద్దిపేట : సంక్రాంతి పండుగ సందర్భంగా వ్యవసాయ బావుల వద్ద రైతులు జరుపుకునే కాట్రావుల పండుగ కనుమరుగై పోతున్న క్రమంలో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామంలో కొందరు రైతులు మాత్రం ప్రతీ ఏటా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను స్థానిక రైతులు ఘనంగా నిర్వహించారు. ఎడ్లు, పశువులు కనుమరుగవుతున్న క్రమంలో ఈ గ్రామంలో ఉన్న పశువులకు కాట్రావుల పండుగ సందర్భంగా స్నానాలు చేయించి, కొమ్ములకు జాజు పూసి, పూల దండలువేసి తోరణాల కింది నుంచి తోలారు.
రైతు జీవితంతో ముడిపడి ఉన్న ఎడ్లకు ఏడాదికి ఒక సారి సంక్రాంతి సందర్భంగా వచ్చే కాట్రావుల పండుగ ఒకప్పుడు ప్రతి గ్రామంలో రైతులు ఘనంగా జరుపుకునేవారు. అప్పట్లో పశువులు, నాగటెద్దులు, పాడిగేదెలతో రైతుల కొట్టాలు కళకళలాడేవి.
ఇపుడు కాట్రావుల పండుగను జరుపుకునే రైతులే కరువైన నేపథ్యంలో గూడెం గ్రామంలో ఈ ఆచారాన్ని కాపాడుతూ రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి ఏటా ఇలాగే కాట్రావుల పండుగ జరుపుకుంటామని స్థానిక రైతు సదయ్య తెలిపారు. రైతులు ఈ సంప్రదాయిన్ని కొనసాగించాలని ఆయన కోరారు.