హైదరాబాద్ : వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచ్లు ఇవాళ మంత్రి కేటీఆర్ను ప్రగతి భవన్లో కలిశారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ సూచన మేరకు గంభీర్పూర్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేయాలని కేటీఆర్కు వారు వినతి పత్రం సమర్పించారు. ఇందుకు మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.
గంభీర్పూర్లో 344 ఎకరాల్లో మామిడి, పసుపు స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా అందుబాటులో ఉన్న మామిడి, పసుపు పంటలకు సంబంధించి రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. జగిత్యాల జిల్లాలో 36 వేల ఎకరాల్లో మామిడి, పసుపు 22 వేల ఎకరాల్లో పండిస్తున్నామని తెలిపారు. ఈ రెండు ప్రధాన పంటల ప్రాసెసింగ్, శుద్ధి మన ప్రాంతంలోనే జరిగితే రైతులకు గిట్టుబాటు ధర రావడమే కాకుండా, వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తెలిపారు. దీని ఏర్పాటుకు గంభీర్పూర్లో 344 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందన్నారు. ఈ ప్రతిపాదనను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి, జడ్పీటీసీ నాగం భూమయ్య, ఎంపీపీ జవ్వాజి రేవతి గణేష్, వైస్ ఎంపీపీ కిరణ్ రావు, ఎంపీటీసీలు ధన్యవాదాలు తెలిపారు.