Kashi Tamil Sangamam | హిందువులు జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ. అక్కడకు వెళ్లాలంటే మన రాష్ట్ర వాసులకు ప్రయాసే. కాశీకి రైళ్లు ఉన్నా.. ఇతర రూట్లలో అదనంగా 300 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తున్నది. కానీ, బనారస్ కన్యాకుమారి రైల్వే మార్గంలో వెళ్తే అదనపు దూరం తగ్గనుండగా, కేంద్రం మాత్రం చిన్నచూపే చూస్తున్నది.
ఆదివారం ప్రధాని మోదీ తమిళుల కోసం బనారస్ కన్యాకుమారి మధ్య ‘కాశీ తమిళ సంగమం’ అనే వారాంతపు ఎక్స్ ప్రెస్ను ప్రారంభిస్తున్నా.. మనకు మాత్రం పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఆ రాష్ట్రంలో 18 చోట్ల హాల్టింగ్ ఇచ్చినా.. మనకు మాత్రం 11 చోట్ల అవకాశముంటే కేవలం ఖమ్మం, వరంగల్, సిర్పూర్ కాగజ్నగర్ చోట్ల మాత్రమే ఆపుతుండడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ‘తెలంగాణకేది కాశీ తెలుగు సంగమం వీక్లీ ఎక్స్ ప్రెస్’ అని ప్రశ్నిస్తున్నారు. లేదంటే మిగతా 8 చోట్ల్ల ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.
– పెద్దపల్లి, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ)
పెద్దపల్లి, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : తమిళనాడు ప్రజల కోసం ప్రత్యేకంగా కన్యాకుమారి -బనారస్ మధ్య ‘కాశీ తమిళ సంగమం’ అనే వీక్లీ ఎక్స్ప్రెస్ను వేశారు. బనారస్ టూ కన్యాకుమారి (16368), కన్యాకుమారి టూ బనారస్ (16367) రైళ్లను నడుపనున్నారు. దీనిని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్నారు. అయితే ఈ రైలుకు ఆ రాష్ట్రంలో 18 చోట్ల హాల్టింగ్ ఇచ్చారు. కానీ, కాశీతో ఎంతో అనుబంధమున్న మన రాష్ట్రంలో 11 చోట్ల అవకాశమున్నా కేవలం మూడు చోట్లే హాల్టింగ్ ఇచ్చారు.
మధిర, డోర్నకల్, మహబూబాబాద్, కే సముద్రం, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లిలో ఆపే అవకాశమున్నా.. ఖమ్మం, వరంగల్, సిర్పూర్ కాగజ్నగర్ వద్ద మాత్రమే ఆపనున్నారు. నిజానికి తెలంగాణ నుంచి కాశీకి వెళ్లేందుకు రైళ్లు ఉన్నా.. ఇతర దూరపు రూట్లలో వెళ్లాల్సి వస్తున్నది. పెద్దపల్లి జంక్షన్ నుంచి చూస్తే.. వారణాసి, పాట్నాకు వెళ్లే రైళ్లు గ్రాండ్ ట్రంక్ మార్గమైన బల్లార్షా- సేవాగ్రామ్- నాగపూర్-ఇటార్సీ అటు నుంచి జబల్పూర్ మీదుగా చుట్టూ తిరుగుతూ అదనంగా 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తున్నది.
అదే ‘కాశీ తమిళ సంగమం’ వీక్లీ ఎక్స్ప్రెస్ అయితే.. వారణాసి జంక్షన్కి అత్యంత దగ్గరి రైల్వే మార్గమైన బల్లార్షా- నగ్బిర్- గొండియా బాలఘాట్- నైన్పూర్- జబల్పూర్ మీదుగా వెళ్తే సుమారుగా 300 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. అలాగే తమిళనాడు రాష్ట్రంలోని మధురై, తంజావూరు, తిరుచ్చి, కన్యాకుమారి, తిరునల్వేలి పుణ్యక్షేత్రాలతోపాటు ఉత్తరాన ప్రయాగ, కాశీ పుణ్యక్షేత్రాలను నేరుగా దర్శించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇంత ప్రయోజనమున్న ఆ రైలును తెలంగాణకు ఎందుకు కేటాయించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. తమిళులకు చేరువవుతున్న కాశీ ప్రయాణం తమకెందుకు దూరమని ప్రశ్నిస్తున్నారు. ఎనిమిది చోట్ల హాల్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
హిందువులు అత్యంత పవిత్రంగా కాశీ ప్రయాణాన్ని చూస్తారు. జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్లాలని తాపత్రయ పడుతారు. ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇకడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశిస్తాయని హిందువులు విశ్వసిస్తారు. హిందూ వివాహ వేడుకల్లో (ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గంలో) కాశీ యాత్ర అనేది తప్పనిసరిగా ఉంటుంది. కాశీ మన తెలంగాణ ప్రజలకు ఎంతో ముఖ్యమైనది. ఈ నగరంతో మన రాష్ట్ర ప్రజలకు అనుబంధం విడదీయరానిది. పితృ కార్యాలకు తప్పనిసరిగా కాశీ నగరానికి వెళ్తుంటారు.
చనిపోయిన వారి అస్థికలను, చితా భస్మాన్ని కాశీ గంగానదిలో కలుపుతారు. కాశీ నుంచి తెచ్చిన గంగా జలాన్ని రామేశ్వరంలోని సముద్రంలో కలుపుతారు. అలాగే రామేశ్వరం నుంచి తీసుకువచ్చిన ఇసుకను కాశీ గంగలో కలుపుతారు. ఈ సంప్రదాయం గత శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నది. అయితే కాశీ నగరంతో ఇంత అనుబంధమున్న మన రాష్ర్టానికి ‘కాశీ తమిళ సంగమం’ అనే ఎక్స్ ప్రెస్ రైలు మాదిరిగా ‘కాశీ తెలంగాణ సంగమం’ అనే పేరిట ఎక్స్ ప్రెస్ రైలుని ప్రారంభించాలని మన ప్రజలు కోరుతున్నారు. ఈ రైలు కోసం తెలంగాణలోని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి, ఇతర ఎంపీలు కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.