హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాబోయే రోజుల్లో ముదిరాజ్ సామాజికవర్గ నాయకులకు బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. రాజ్యసభ, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్తు చైర్మన్లు, మేయర్లు ఇలా ఎన్నో పదవులు వరిస్తాయి అని పేర్కొన్నారు. ముదిరాజ్ సామాజికవర్గానికి ప్రభుత్వపరంగా ఎన్నో పథకాలను అమలు చేశామని, రాజకీయంగానూ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ముదిరాజ్ శుక్రవారం గజ్వేల్లోని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాసానికి కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వర్ పార్టీలో చేరడం తనకు చాలా సంతోషంగా ఉన్నదని తెలిపారు. కాసాని తనకు పాత మిత్రుడని, పార్టీలోకి ఎప్పుడో రావాల్సింది గానీ, కాస్త ఆలస్యమైందని చెప్పారు. బండ ప్రకాశ్తోపాటు కాసానికి సముచితం స్థానం కల్పించేవాడినని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యులయ్యేందుకు బీఆర్ఎస్లోకి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నట్టు చెప్పారు. ఈటల రాజేందర్లాంటి వ్యక్తులు పార్టీ నుంచి వెళ్లినా అంతకంటే పెద్దనాయకులు కాసాని, మిగతా నాయకులు, అతని అనుచరులంతా బీఆర్ఎస్ కుటుంబంలోకి రావడం సంతోషంగా ఉన్నదని తెలిపారు.
కాసానితోపాటు బీఆర్ఎస్లోకి క్యూ
కాసానితోపాటు బీఆర్ఎస్లో చేరినవారిలో టీడీపీ మాజీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేశ్, బోయినపల్లి మాజీ మారెట్ కమిటీ చైర్మన్ ముప్పిడి గోపాల్, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసిన ప్రకాశ్ ముదిరాజ్, టీడీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బండారి వెంకటేశ్ ముదిరాజ్, పటాన్చెరు కాంగ్రెస్ లీడర్ సహదేవ్ ముదిరాజ్, టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు మేకల భిక్షపతి ముదిరాజ్, పుట్టిరాజ్ ముదిరాజ్, టీడీపీ కరీంనగర్ నియోజవర్గ ఇన్చార్జి కనకయ్యముదిరాజ్, టీడీపీ ముషీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి తలారి శ్రీకాంత్ముదిరాజ్, టీడీపీ బాన్సువాడ ఇన్చార్జి కరాటే రమేశ్ ముదిరాజ్, టీడీపీ స్టేట్ కల్చరల్ వింగ్ అధ్యక్షుడు చంద్రహాస్, ముదిరాజ్ మహాసభ స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ జగదీశ్వర్ ప్రసాద్ముదిరాజ్, బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మంద శ్రీనివాస్ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ నిజాంపేట్ నాయకుడు ఆంజనేయులుముదిరాజ్, మేడ్చల్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు దొంతి నర్సింహులుముదిరాజ్, టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జీ జగదీశ్ యాదవ్, టీడీపీ స్టేట్ సెక్రటరీ మన్నె రాజు, టీడీపీ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ సెక్రటరీ దూసకంటి వెంకటేశ్, బాచుపల్లి మాజీ ఎంపీటీసీ నందిగామ సత్యనారాయణ, టీడీపీ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మైనార్టీ అధ్యక్షుడు లషర్ అశోక్కుమార్, టీడీపీ గుడి మలాపూర్ అధ్యక్షుడు అకెర శివరాజుముదిరాజ్ ఉన్నారు.