ఎమ్మెల్సీల గెలుపుతో గులాబీ శ్రేణుల్లో జోష్
హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తున్నది. గులాబీ దండు రెండింటికీ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకొని ద్విదశాబ్ది సంబురాలను ద్విగుణీకృతం చేసుకొనేందుకు సమాయత్తం అవుతున్నది.రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మరోకటి లేదని ఈ ఫలితాలు స్పష్టంచేశాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీలో నెలకొన్న వాతావరణాన్ని దూరం చేయాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. కార్యాచరణను రూపొందించి గులాబీ సైన్యా న్ని బరిలో నిలిపారు.
‘పార్టీ బాగుంటేనే మనకు మనుగడ’ అని టీఆర్ఎస్ శ్రేణులు గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారు. ఫలితంగా రెండు స్థానాల్లో టీఆర్ఎస్ జెండా ఎగిరింది. ఈ అసాధారణ విజయం గులాబీ దండులో కొత్త జోష్ను నింపింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం (ఏప్రిల్ 27) నాటికి నాగార్జునసాగర్ ఉపఎన్నిక పూర్తి అవుతుందని, అక్కడా ఇదే ఫలితం వస్తుందని, సంబురాలు చేసుకుంటామని శ్రేణులు పేర్కొంటున్నాయి. హైదరాబాద్ తమదేనని విర్రవీగిన బీజేపీ అభ్యర్థి రామచందర్రావుకు 38 శాతం ఓట్లకు పరిమితం చేయడంలో టీఆర్ఎస్ విజయం సాధించిం ది. 52 శాతం ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్ వాణీదేవి విజయబావుటా ఎగురవేశారు.
నల్లగొండ- వరంగల్- ఖమ్మం స్థానం నుంచి పోటీచేసిన బీజేపీ అభ్యర్థిని నాలుగోస్థానంలోకి విసిరేసి, కాంగ్రెస్ను దరిదాపుల్లోకి రానివ్వని పటుత్వాన్ని గులాబీ శ్రేణులు ప్రదర్శించాయి. పట్టభద్రుల ఓటర్ల నమోదు దగ్గరి నుంచి పోలింగ్ శాతం పెంచుకోవడం, పెరిగిన పోలింగ్ శాతంలో తమ గెలుపు వాటాను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో పార్టీ అనుసరించిన వ్యూహం సునాయాస విజయాన్ని నమోదుచేసింది. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకున్నాయి. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు నిర్వహించాయి. ఈ గెలుపు గులాబీ శ్రేణుల్లో ఉద్యమస్ఫూర్తిని రగిలించింది. భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం చేసింది.
మిన్నంటిన సంబురం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా, వాణీదేవి విజయాలతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి, మిఠాయిలు పంపిణీ చేసుకొన్నా రు. నల్లగొండ, సూర్యాపేట జిల్లా ల్లో ర్యాలీలు నిర్వహించి పట్టభద్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం నగరంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, ఎమ్మెల్సీ బాలసాని నేతృత్వంలో పటాకులు కాల్చారు. సత్తుపల్లి విజయోత్సవ సంబురాల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
విజేతలకు బ్రాహ్మణ సంఘాల సన్మానం
హైదరాబాద్ సిటీబ్యూరో: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన పల్లా రాజేశ్వర్రెడ్డి, సురభి వాణీదేవిని ఆదివారం బ్రాహ్మణ సేవాసమితి, తెలంగాణ అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్లో వేర్వేరుగా సత్కరించారు. చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆధ్వర్యంలో పల్లాను సన్మానించి ఆశీర్వదించారు. ఆయా కార్యక్రమాల్లో తెలంగాణ అర్చక సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ, రాష్ట్ర కన్వీనర్ పవన్కుమార్, అధ్యక్షుడు వేణుగోపాలాచర్యులు, బ్రాహ్మణ సేవాసమితి కన్వీనర్ ఐనవోలు సత్యమోహన్, పోచంపల్లి రమణారావు తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయనున్నట్టు వారు తెలిపారు.
సీపీఎస్ ఉపాధ్యాయ సంఘం అభినందనలు
సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్రెడ్డికి సీపీఎస్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్, ప్రధాన కార్యదర్శి చీటి భూపతిరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ టీవీ ప్రసాద్ సంఘం తరఫున అభినందించారు.