హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): కేంద్రంతోపాటు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచేలా సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నారని, కేసీఆర్ దార్శనికత, నాయకత్వం దేశానికి అవసరమని కర్ణాటక ఎన్నికల కమిషన్ రిటైర్డ్ సీఈసీ శ్రీనివాసాచారి చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలో ఇరిగేషన్తోపాటు వివిధ శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించి, ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా పదవీ విరమణ పొందిన శ్రీనివాసాచారి బుధవారం హైదరాబాద్ విచ్చేశారు.
రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర ఆయనను ప్రత్యేకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచారి మాట్లాడుతూ అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు వల్లే అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు.