గజ్వేల్, డిసెంబర్ 27: గజ్వేల్ ప్రాంతంలోని అడవులు చాలా అద్భుతంగా ఉన్నాయని అటవీ శాఖ ట్రైనీ ఎఫ్ఆర్వోల బృందం కితాబిచ్చింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గంలోని సంగాపూర్, సింగాయపల్లి అటవీ ప్రాంతాలు, గజ్వేల్ అర్బన్ పార్కును కర్ణాటకలోని అటవీ కళాశాలలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఎఫ్ఆర్వోలు మంగళవారం సందర్శించారు. ముందుగా వారు సింగాయపల్లి అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. అడవుల అభివృద్ధికి చేపట్టిన చర్యల గురించి, అడవిలో పెరుగుతున్న వివిధ జాతుల చెట్ల గురించి డీఎఫ్వో శ్రీనివాస్, ఎఫ్ఆర్వో కిరణ్కుమార్ వారికి వివరించారు.
ట్రైనీ అధికారుల బృందంలో అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ర్టాలకు చెందిన వారున్నారు. ఇక్కడి అడవుల్లో పెంచుతున్న చెట్ల గురించి వారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంగాపూర్ అటవీ ప్రాంతానికి చేరుకున్న ట్రైనీ అధికారుల బృందం పునరుజ్జీవన చర్యల్లో భాగంగా నాటి అభివృద్ధి చేసిన అడవిని పరిశీలించారు. కేవలం నాలుగు ఏండ్లలోనే ఏపుగా పెరిగిన చెట్లను చూసి ట్రైనీ అధికారులు ఆశ్చర్యపోయారు. అక్కడి నుంచి అర్బన్ పార్క్ను సందర్శించారు. సింగాయపల్లి అడవిలో అరుణాచల్ప్రదేశ్ ట్రైనీ అధికారులు సీతాఫలం ఆకులను సేకరించారు. తమ ప్రాంతంలో ఈ చెట్లు ఉండవని, చూసినందుకు చాలా ఆనందంగా ఉన్నదని అన్నారు.