బెంగళూరు: కరెంటుపై కాంగ్రెస్ పార్టీ కుట్ర మరోసారి బట్టబయలైంది. వ్యవసాయానికి 24 గంటల కరెంటు అక్కర్లేదని కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ మతిలేని వ్యాఖ్య చేశారు. రైతులు సాగుచేసే భూమి విస్తీర్ణాన్ని బట్టి 5 గంటలు, 6 గంటలు, ఆఖరికి 7 గంటల కరెంటు సరిపోతదని, అంతకుమించి అవసరమే లేదని ఓ తలాతోక లేని స్టేట్మెంట్ ఇచ్చారు. రైతులందరికీ 24 గంటల కరెంటు ఇవ్వాల్సిన అవసరమే లేదని అనాలోచితంగా మాట్లాడారు.
కాగా, కరెంటు గురించి కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కరెంటుపై తెలివి తక్కువ వాదనే చేశారు. రైతులకు మూడు గంటల కరెంటే చాలన్నారు. మోటార్లకు 10 హెచ్పీ మీటర్లు పెట్టుకుంటే గంటకు ఎకరం చొప్పున పారుతుందని, మూడు గంటల కరెంటు సరిపోతుందన్నారు.
కాగా, కాంగ్రెస్ నేతల మతిలేని వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కరెంటు కాటగలిసినట్టేనని డీకే శివకుమార్ వ్యాఖ్యలతో మరోసారి రుజువైందని విమర్శలు గుప్పిస్తున్నారు. సరిపడా కరెంటు ఇవ్వకుండా వ్యవసాయాన్ని దండగగా మార్చి, రైతుబంధును ఎత్తేయాలనేది కాంగ్రెస్ కుట్రలా కనిపిస్తోందని దుమ్మెత్తిపోస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు.