బెంగళూరు, ఆగస్టు 19: కర్ణాటక సీఎం పదవి విషయంలో బీజేపీపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ పోస్టు చాలా ఖరీదుతో కూడుకున్న దని, బీజేపీలో రూ.2,500 కోట్లు పలుకుతున్నట్టు ఆ పార్టీ నేతనే ఒకరు చెప్పారని అసెంబ్లీలో కాంగ్రెస్ పక్షనేత బీకే హరిప్రసాద్ అన్నారు. ‘సీఎం పోస్టు విషయంలో పెద్దయెత్తున డబ్బు ప్రమే యం ఉన్నది. బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పిన దాని ప్రకారం.. సీఎం కుర్చీ కోసం ఎవరైనా రూ.2,500 కోట్లు పెట్టాల్సిన పరిస్థితి నెలకొన్నది’ అని పేర్కొన్నారు. బీజేపీ అధిష్టానం సీఎం బొమ్మైను మార్చనున్నదని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. యెడియూరప్పను బీజేపీ తమ పార్లమెంటరీ ప్యానెల్లోకి తీసుకున్న నేపథ్యంలో అధినాయకత్వం బొమ్మైకు ఉద్వాసన పలుకనున్నదని తాజాగా ప్రచారం జరుగుతున్నది.