కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 28 : కరీంనగర్ మండలం నగునూర్ గ్రామంలోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో వైద్యులు పదేండ్ల చిన్నారికి అరుదైన గుండె శస్త్రచికిత్స చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లికి చెందిన చిగురాల శారద-సతీశ్ దంపతులకు కవల పిల్లలు. ఇందులో ఒకరు పుట్టుకతోనే దివ్యాంగురాలు. రెండో కూతురు అక్షిత సుమారు ఐదేండ్లుగా తీవ్రమైన ఛాతి నొప్పి, ఆయాసం, శ్వాస సమస్యతో ఇబ్బంది పడుతున్నది. స్థానికంగా ఓ ప్రైవేటు దవాఖానలో చూపించగా గుండె సంబంధిత సమస్య (ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్) ఉన్నదని వెల్లడైంది.
చికిత్సకు చాలా ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో వ్యవసాయ కూలీ పని చేసుకొని జీవించే సతీశ్ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ఈ క్రమంలో ప్రతిమ వైద్యశాల గురించి తెలుసుకొని వైద్యసాయం కోసం వచ్చారు. ఈ నెల 19న డాక్టర్ రవీందర్రెడ్డి, (కార్డియాలజిస్ట్), డాక్టర్ అవీన్సనర్ (కార్డియోథొరాసిక్ సర్జన్), డాక్టర్ నిఖిల్ (హెచ్వోడీ ఆఫ్ అనస్థీషియా) బృందాన్ని సంప్రదించగా, వారు పాపను చూసి త్వరగా శస్త్ర చికిత్స చేయాలని సూచించారు.
కార్పొరేట్ దవాఖానల్లో రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. పాప పరిస్థితి, కుటుంబ ఆర్థికస్థితి చూసి చలించిన ప్రతిమ వైద్యశాల చైర్మన్ బోయినపల్లి శ్రీనివాస్రావు ఉచితంగా శస్త్ర చికిత్సకు ముందుకువచ్చారు. దీంతో ఈ ముగ్గురు వైద్యుల బృందం పాపకు గుండె శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం అక్షిత ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, త్వరలో డిశ్చార్జి చేయనున్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతిమ వైద్యశాల డీన్ డాక్టర్ అచంట వివేకానంద్, సీఏవో రామచందర్రావు మాట్లాడుతూ.. హైదరాబాద్లోని కార్పొరేట్ దవాఖానలకు దీటుగా అత్యాధునిక పరికరాలతో తమ వైద్యశాలలో శస్త్రచికిత్సలు చేస్తున్నట్టు తెలిపారు. సత్వరం స్పందించి అక్షితకు ప్రాణం పోసిన వైద్యుల బృందానికి, ప్రతిమ యాజమాన్యానికి ఆమె తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.