కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 4: ఎన్నికల వచ్చాయంటే చాలు బీ ఫాంలు, టికెట్లను అమ్ముకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదేనని, మాయమాటలు చెప్పే ఆ పార్టీ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. శనివారం కరీంనగర్ నియోజకవర్గంలోని కరీంనగర్రూరల్ మండలం చేగుర్తి, నల్లగుంటపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు, మహిళలు మంత్రికి ఘన స్వాగతం పలికారు.
మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో బీఆర్టీయూ అనుబంధ కార్మిక సంఘాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సాయంత్రం కరీంనగర్లోని 9, 11, 32 డివిజన్లలో ఇంటింటి ప్రచారం సాగించారు. ఆయాచోట్ల మంత్రి గంగుల ప్రసంగిస్తూ.. కర్ణాటక ఎన్నికల్లో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అక్కడి ప్రజల్ని మోసం చేసిందని విమర్శించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటుతోపాటు సాగునీరు, రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో మహిళల కోసం సౌభాగ్యలక్ష్మి కింద రూ.3 వేలు, రూ.400లకే గ్యాస్ సిలిండర్ను అందించనున్నామని చెప్పారు. అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్కు ప్రజలు అండగా నిలిచి పట్టం కట్టాలని కోరారు. కార్యక్రమాల్లో నగర మేయర్ యాదగిరి సునీల్రావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.