Minister Gangula | ఉత్తర తెలంగాణకు గేట్ వేగా కరీంనగర్ నిలువనున్నదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ మానేరు వంతెనపై నిర్మించిన తీగల వంతెనను ఈ నెల 14న ప్రారంభించనున్నట్లు తెలిపారు. మంత్రి సోమవారం కలెక్టర్ కర్ణన్, సీపీ సుబ్బారాయుడుతో కలిసి కేబుల్ బ్రిడ్జి అప్రోచ్రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మానేరుపై రూ.224 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేబుల్ బిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయన్నారు. అప్రోచ్ రోడ్డు పనులు డైనమిక్ లైటింగ్ సిస్టం పనులు తుదిదశకు చేరాయన్నారు. ప్రారంభోత్సవం తర్వాత ప్రతి ఆదివారం సాయంత్రం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు సందర్శకులకు అనుమతిస్తామని వెల్లడించారు.
ప్రజల సందర్శన నిమిత్తం కొద్ది రోజుల పాటు క్రాకర్షోలు, లేజర్ షోలు, ఫుడ్ ఫెస్టివల్తో పాటు వంతెనకు ఇరువైపులా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నగరానికి ఓ పర్యాటక కేంద్రంగా ఉంటుందన్నారు. ఈ బ్రిడ్జిపై రూ.6.5 కోట్లతో డైనమిక్ లైటింగ్ పనులు పూర్తవుతాయన్నారు. ఇదిలా ఉండగా.. మానేరు రివర్ ఫ్రంట్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని, మరో ఆరు నెలల్లో పనులు పూర్తవుతాయన్నారు. మంత్రి వెంట మేయర్ సునీల్రావు ఉన్నారు.