హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): అంధత్వ రహిత తెలంగాణ సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. గతంలో కంటివెలుగు కార్యక్రమంలో 1.52 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించిన విధంగానే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సైతం కంటిపరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ మూడు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ను పూర్తి చేసింది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా హైస్కూల్ విద్యార్థులకు కంటిపరీక్షలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నది. జీవనశైలి, ఆహార అలవాట్లలో మార్పులు, ఒత్తిడి కారణంగా చిన్నతనంలోనే విద్యార్థులు కంటి సమస్యలతో బాధపడుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటివారికి ఉచితంగా కండ్లద్దాలు, వైద్యసేవలు అందించనున్నారు.
15% మందికి సమస్యలు?
రాష్ట్రంలోని 6,445 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 8,9,10వ తరగతులు చదువుతున్న విద్యార్థులు దాదాపు 8.76 లక్షల మంది ఉన్నారు. వీరికి ‘సూల్ చిల్డ్రన్ ఐ స్రీనింగ్ ప్రోగ్రామ్’ పేరుతో వేగంగా కంటిపరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకొంటున్నది. దాదాపు 15% విద్యార్థుల్లో కంటి సమస్యలు ఉండే అవకాశమున్నట్టు ప్రభుత్వం అంచనా.