మెదక్, అక్టోబర్ 01 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో ప్రజాబలం ఉన్న నాయకులకు విలువ లేదని, డబ్బు సంచులు, నోట్ల కట్టలకే ఆ పార్టీ అధిష్ఠానం ప్రాధాన్యం ఇస్తున్నదని మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి విమర్శించారు. తిరుపతిరెడ్డి మెదక్ అసెంబ్లీ టికెట్ను ఆశించగా.. మైనంపల్లి హన్మంతరావు తనయుడు రోహిత్కు టికెట్ కేటాయించే అవకాశం ఉండటంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఆ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు కంఠారెడ్డి ఆదివారం తన రాజీనామా లేఖను విడుదల చేశారు. తిరుపతిరెడ్డి రాజీనామాతో మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్దషాక్ తగిలింది.
పదేండ్లు కష్టపడినా ప్రయోజనం శూన్యం
కంఠారెడ్డి రాజీనామా లేఖ సారాంశం ప్రకారం.. ‘నేను కాంగ్రెస్ పార్టీ కోసం పదేండ్లుగా కష్టపడి పనిచేసిన. అయినా ప్రయోజనం శూన్యం. పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కూడా స్థానం లేదు. ఈ మధ్య కాంగ్రెస్లో వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఎవరికైనా పార్టీని వీడాలని అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన సేవలు, త్యాగాలు, పడ్డ కష్టాలను అధిష్ఠానం గుర్తించడం లేదు. పార్టీ టికెట్ల కేటాయింపులపై నిత్యం వస్తున్న ఆరోపణలు, వాటి పరిణామాలను చూసి నేను తీవ్రమైన మనోవేదనకు గురయ్యాను. పదేండ్లపాటు పార్టీ బలోపేతం కోసం శాయశక్తులా కృషి చేశాను. అంతేకాదు.. పోలీసు అక్రమ కేసుల్లో ఇరుక్కొని న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నాను. కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులకు పార్టీలో చోటు కల్పించడంతో నేను మనస్తాపం చెందాను. అలాంటి వారి నాయకత్వంతో పార్టీకి మనుగడ లేదు. ప్రజలకు కూడా ఉపయోగం లేదు. కేవలం నోట్ల కట్టలను నమ్ముకునే వారు.. రేపు రాష్ట్రాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నడి బజారులో నవ్వుల పాలు చేయడం ఖాయం’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
డబ్బులిచ్చేవారికే సీట్లు
కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా ఉంటూ పనిచేసే నాయకులకు సీట్లు దక్కడం లేదని, డబ్బులిచ్చేవారు కాంగ్రెస్ వ్యతిరేకులైనా సరే.. వారికే పార్టీ అధిష్ఠానం టికెట్లు ఇస్తున్నదని కంఠారెడ్డి తిరుపతిరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్లో డబ్బు సంచులు ఉన్న నాయకులకే సీట్లు దక్కే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ప్రజాబలం ప్రాతిపదికన కాకుండా ధన బలానికే ప్రాధాన్యం ఇస్తున్నారని, ఈ విషయంలో ఏఐసీసీ అధ్యక్షుడితోపాటు సోనియాగాంధీ, రాహుల్గాంధీ లాంటి అగ్రనాయకులు కూడా మౌనం వహించడం తనకు ఎంతో బాధ కలిగిందని తన రాజీనామా లేఖలో కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.