హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 25 (నమస్తే తెలంగాణ): కరువు పరిస్థితులను తట్టుకొని తక్కువ సమయంలో అధిక దిగుబడిని ఇచ్చే కంది వంగడాలను ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సాధారణ కందుల పంట కాలం 180 రోజులు కాగా, 40-50 రోజుల వ్యవధిలోనే పంట చేతికి వచ్చేలా కొత్త రకం వంగడాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇవి తక్కువ నీటి లభ్యత, తెగుళ్లను తట్టుకొనే సామర్థ్యం 50 శాతం అధికంగా కలిగి ఉంటాయి.
ఈ వంగడాలను ఐసీఏఆర్- పల్స్ రీసెర్చ్ సెంటర్, కృషి విద్యాపీఠ్, అగ్రికల్చర్ కాలేజీ వంటి సంస్థలతో కలిసి ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రస్తుత రకాలతో హెక్టారు విస్తీర్ణంలో 750-850 కిలోల దిగుబడి వస్తున్నది. అయితే, 2050 నాటికి ఏకంగా 1400-1600 కిలోల దిగుబడిని సాధించేలా హైబ్రిడ్స్ ఐసీపీహెచ్ 2433, ఐసీపీహెచ్ 2431, ఐసీపీహెచ్ 2429, ఐసీపీహెచ్ 2438 రకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.