Vijayendra Saraswathi | ధర్మనిష్ట, ధార్మిక చింతనగల సంస్కారనేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి కొనియాడారు. హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక హంగులతో నిర్మించిన విప్రహిత భవనం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని కంచి నుంచి ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్ల క్రితమే తెలంగాణలో పర్యటించిన తరుణంలో సిద్ధిపేటలో బోగేశ్వర ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా కేసీఆర్ను కలుసుకున్న సందర్భాలను గుర్తుచేసుకున్నారు. మళ్లీ యాదాద్రి ఆలయాన్ని కూడా ఎంతో సుందరంగా తీర్చిదిద్దారని వివరించారు.
భక్తిభావాలనే కాకుండా సాహిత్యం, లలితకళలపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక ఆసక్తిని చూపుతారని వివరించారు. దేశంలో ధర్మాన్ని ఆచరిస్తున్న తెలంగాణకు ప్రత్యేకస్థానం ఉందని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో లోకహిత కోసం హోమాలు, పూజలు చేయడంతోపాటు సామాజహితం కోసం హరితతోరణం, భగీరథ, ధరణి తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్నారని వివరించారు. సీఎం కేసీఆర్ ధర్మప్రవర్తులు, షడఖర్మ నిరతులని ధర్మ సంస్కృతి పునరుద్ధరణకు పాటుపడుతున్నారని కొనియాడారు.
బ్రాహ్మణ సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారని, ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా అండగా నిలబడుతున్నారని తెలిపారు. హైదరాబాద్లో విశాలస్థలంలో మూడంతస్తుల్లో కల్యాణ మంటపం, కోచింగ్ సెంటర్ బ్రాహ్మణ సదనం నిర్మించడంపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో సుఖశాంతులతో పరిఢవిల్లుతున్నదని, వేదపాఠశాలల సహకారానికి, నిరుపేద అర్చకుల ఆర్థిక అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని సహకారాన్ని అందిస్తున్నదని కొనియాడారు. తెలంగాణ సంకల్పాలన్ని ఇదేరీతి నెరవేరాలని ఆకాంక్షించారు. వేదశాస్త్ర విద్యాభివృద్ధికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ప్రోత్సహిస్తున్నదని సంతోషం వ్యక్తం చేశారు.