లబ్ధిదారు జూపెల్లి చందన ఆనందం
మానకొండూరు, మే 4: ఓ నిరుపేద యువతికి కల్యాణ లక్ష్మి పథకం ద్వారా వచ్చిన డబ్బులు ఎంతో ఉపయోగపడ్డాయి. కరీంనగర్ జిల్లా మానకొండూర్కు చెందిన జూపెల్లి పార్వతి-వెంకన్న దంపతులు. వీరిద్దరు అకాల మరణంతో వారి కూతురు చందన అనాథగా మారింది. బంధువుల సహకారంతో ఇటీవల వివాహమైంది. కనీసం రూ. 5 వేలు కూడా అప్పు పుట్టని దయనీయ పరిస్థితిలో ఉండగా.. పెండ్లి అయిన వెంటనే కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకొన్నది. ఈ పథకం కింద లక్షా నూటాపదహారు రూపాయలు మంజూరు కాగా బుధవారం ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ చేతుల మీదుగా చెక్కు అందుకొన్నది.
సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు సహకారంతో తనకు ఈ పథకం కింద చెక్కు మంజూరైందని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. కేసీఆర్ సర్కారుకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపింది. ఈ పథకం ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని ఆమె పేర్కొన్నారు.