Kalyana Lakshmi | దోసల రామచంద్రం-దేవవ్వలది దోసలగూడెం. సిరిసిల్ల రాజన్న జిల్లా గంభీరావుపేట మండలంలో ఉన్నదా ఊరు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన రామచంద్రం తనకున్న రెండెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. దేవవ్వ బీడీ కార్మికురాలు. ఏండ్లపాటు గుడిసెలోనే కాలం గడిపిన వీరు కష్టార్జితంతో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు. పదోతరగతి వరకే చదివిన రామచంద్రానికి తన పిల్లలను ఉన్నత చదువులు చదివించాలన్నది కల. కలల్ని నిజం చేసుకునే ఆర్థిక స్థోమత చాలా కుటుంబాల్లాగే రామచంద్రానికీ లేదు. పిల్లల్ని చదివించడం.. వారి పెండ్లి చేయడం చాలావరకు మధ్యతరగతి కుటుంబాలకు జీవితకాలపు సవాలు. మరీ ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులకు.. ప్రతి అడుగూ డబ్బుతో ముడిపడినదే. నిరుపేద కుటుంబాల గురించి ఊహించటం కూడా కష్టమే. ఉన్నత చదువులు చదివించలేక, పెండ్లి చేసే తాహతు లేక బలిమీటికి జీవితాలు చాలించిన ఉదంతాలెన్నో కండ్లముందు కదలాడుతాయి. ఇప్పడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. తరతరాలుగా సామాజిక అసమానలతో సతమతమైన కుటుంబాలెన్నో ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చలువ వల్ల నిలదొక్కుకున్నాయి. వాటిలో రామచంద్రం కుటుంబమూ ఒకటి.
రామచంద్రం పెద్ద కూతురు సంధ్య, రెండో కూతురు సౌమ్య డిగ్రీ పూర్తి చేశారు. మూడవ కూతురు సాయిపూజిత ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నది. కొడుకు ఉదేశ్ నాలుగోతరగతి చదువుతున్నాడు. కూతుళ్లు ముగ్గురూ తెలంగాణ ప్రభుత్వ గురుకుల విద్యార్థినులే. జీవితంలో ఎన్నటికీ సాధించలేమనుకున్న వారి కలలను ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేశారు. చదువు సమస్య గురుకులాల ద్వారా తీరగా, కల్యాణలక్ష్మి ద్వారా పెండ్లి సమస్య కూడా తీరింది. రెండేండ్లక్రితం రామచంద్రం పెద్ద కూతురు సంధ్య పెండ్లితోపాటు ఏడు నెలల క్రితం జరిగిన రెండో కూతురు సౌమ్య పెండ్లికి కూడా కల్యాణలక్ష్మి పథకం కింద రూ.1,00,116 రూపాయల ఆర్థిక సాయం అందింది. పెద్ద కూతురుకు సిరిసిల్ల సర్కారు దవాఖాననే పురుడుపోసింది. కేసీఆర్ కిట్ బోనస్గా అందించింది. గతానికీ ఇప్పటికీ తెలంగాణలో మారిన బతుకుచిత్రమిదే. ఓ సగటు తండ్రి బాధను, బాధ్యతను సంక్షేమ ప్రభుత్వం ఎలా పంచుకోగలదనే దానికి కేసీఆర్ పాలన ఓ మచ్చుతునక. ఆత్మగల్ల సర్కారు అండగా నిలిస్తే.. నిరుపేద కలలు ఎలా సాకారమవుతాయనేదానికి దోసల రామచంద్రం కుటుంబం ఓ ఉదాహరణ.
తెలంగాణలో ఇప్పుడు ఆడబిడ్డల పెండ్లిపై పేదకుటుంబాలకు రంది లేదు. మధ్యగతరగతికి మనాది లేదు. దోసల రామచంద్రం కుటుంబమే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా కల్యాణలక్ష్మి ద్వారా లబ్ధిపొందిన కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. ఒక్క సిరిసిల్ల సెగ్మెంట్లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ తదితర వర్గాలకు చెందిన 13,429 మంది అమ్మాయిలకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా కేసీఆర్ సర్కారు భరోసాను అందించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ మేనమామగా ఆర్థిక చేయూతనిచ్చి పెండ్లిళ్లు చేయించారు. కల్యాణలక్ష్మి పథకం ఆడబిడ్డలను కన్న తల్లిదండ్రులకు భరోసాగా నిలుస్తున్నది. సాధారణంగా పెండ్లి చేసేందుకు అప్పు ఓ పట్టాన పుట్టదు. కానీ కల్యాణలక్ష్మి పుణ్యమాని ఆ సమస్య తీరిపోయింది. పైగా పరువూ, ప్రతిష్ఠ, పరపతి అమాంతం పెరిగింది. వివాహ తంతుకు కావాల్సిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. దరఖాస్తు చేసుకుంటే చాలు చెక్కు చేతిలో పడుతుందన్న నమ్మకంతో తక్షణ అవసరాలకు డబ్బులు, సౌకర్యాలు సర్దుబాటు అవుతున్నాయి. జీవితకాలం గుర్తుండే పెండ్లి లాంటి శుభకార్యాలు ప్రశాంతంగా, హాయిగా, సంతోషంగా జరిగిపోతున్నాయి. మెట్టినింట కూడా ఆడబిడ్డలకు ఆదరణ, గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి.
ముగ్గురు ఆడపిల్లల చదువు, పెండ్లిళ్ల గురించి ఎంతో ఫికరు పడేటోళ్లం. యాడ బజారున పడుతమో.. నలుగురిల నవ్వులపాలవుతమో అని భయపడేటోళ్లం. ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడు. సారుకు మొక్కితీరాలె. ఇది పక్కా బంగారు తెలంగాణ. మా బిడ్డల పెండ్లిళ్లకు రెండేసి తులాల బంగారం పెట్టడం కల్యాణలక్ష్మి వల్లనే సాధ్యమైంది. మా పిల్లలకు కేసీఆర్ సారు బంగారు మేనమామ అయ్యిండు. ఇట్ల మా బిడ్డల పెండ్లిలల్ల ప్రభుత్వం కూడా ఒక చెయ్యేస్తదని ఊహించలేదు. పొందిన మేలు చెప్పుకోవాలంటరు. సుట్టాలు, దోస్తులు, తోటి రైతులు కలిసినప్పుడల్లా కేసీఆర్ మాకు చేసిన మేలు గురించే మాట్లాడుకుంటం. ఆడపిల్లలను కన్నవారికి కల్యాణలక్ష్మి పుట్టెడు ఆనందం పంచుతున్నది. పెండ్లి రుజువులతో ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే చాలు, పిలిచి చెక్కులు ఇస్తున్నరు. మా అసొంటి కుటుంబాలు కేసీఆర్ సారుకు, కేటీఆర్ సారుకు, తెలంగాణ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటం.
– దోసల రామచంద్రం,దేవవ్వ
– (ఇల్లెందుల దుర్గాప్రసాద్, దోసలగూడెం నుంచి)