రుద్రూర్, జూలై 8 : అభివృద్ధి, ప్రజా సంక్షేమం, భవిష్యత్తు ఆలోచనతో పాలించే వాడే నిజమైన నాయకుడని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు అని.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాయకూర్ క్యాంపులో రూ.10 లక్షలతో నిర్మించిన రామాలయ కల్యాణ మండపాన్ని, ప్రజల సౌకర్యార్థం రూ.30 లక్షల నిధులతో నిర్మించిన జనరల్ ఫంక్షన్ హాలును శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతున్నదన్నారు. పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మి వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చే గొప్ప ఆలోచన సీఎం కేసీఆర్దేనన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.