SRSP | హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): లక్ష్మీబరాజ్ నుంచి ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు కాళేశ్వరం జలాల తరలింపు యథావిధిగా కొనసాతున్నది. లోకల్ క్యాచ్మెంట్ ఏరియా నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరద ప్రారంభమైన నేపథ్యంలో అధికారులు పంపింగ్ను తగ్గించారు. ఆదివారం 4 పంపుల ద్వారా లక్ష్మీపంప్హౌస్ నుంచి కాళేశ్వరం జలాలను ఎగువన ఎస్సారెస్పీకి పంపింగ్ను కొనసాగించారు. సరస్వతి, పార్వతి పంప్హౌస్ల్లోనూ మో టర్ను తగ్గించారు. నంది పంప్హౌస్ల్లో ఐదు పం పుల ద్వారా ఎత్తిపోతలను నిర్వహిస్తున్నారు. రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎత్తిపోతలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ప్రాణహితలో స్థిరంగా వరద
తెలంగాణ క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు శనివారం స్వల్పంగా వరదరాగా, ఆదివారం సాయంత్రానికి అది తగ్గుముఖం పట్టింది. ఎస్సారెస్పీకి 26 వేల క్యూసెక్కుల వరద రాగా, ప్రస్తుతం అది 17 వేల క్యూసెక్కులకు పడిపోయింది. ప్రాణహితలో వరద ప్రవాహం స్థిరంగా ఉన్నది. శనివారం సాయంత్రానికి 65 వేల క్యూసెక్కుల వరద లక్ష్మీబరాజ్కు చేరుకుంటుండగా.. 32 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువ బేసిన్లో వరద తగ్గుముఖం పట్టడంతోపాటు సమ్మక్కసాగర్, సీతమ్మసాగర్ వద్ద వరద ప్రవాహం 1.17 లక్షల క్యూసెక్కుల నుంచి 83 వేలకు తగ్గిపోయింది. మరోవైపు కృష్ణాలో వరద పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ఆల్మట్టి, తుంగభద్రలకు శనివారం సాయంత్రానికి 8 వేల క్యూసెక్కుల వరద రాగా, ఆదివారం పూర్తిగా పడిపోయింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం 6,500 క్యూసెక్కుల నుంచి 8,890 స్వల్పంగా పెరిగింది.