Kaleshwaram | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోరాటం ఫలించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలోని మూడు పిల్లర్లు కుంగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాఫర్ డ్యాం కట్టేందుకు నిర్మాణ సంస్థ ముందుకువచ్చినట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ దగ్గర మూడు పిల్లర్లపై కాఫర్ డ్యామ్ను ఎల్అండ్టీ సంస్థ నిర్మించబోతున్నది. మరమ్మతులకు అయ్యే ఖర్చు అంతా తామే భరిస్తామని నిర్మాణ సంస్థ ముందుకువచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం వరదలు వచ్చేలోపు మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లోని 19, 20, 21 పిల్లర్ల దగ్గర కాఫర్ డ్యామ్ను సైతం సైతం ఎల్అండ్టీ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తున్నది.
ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్లో మూడు పిల్లర్లు కుంగిపోయాయి. అయితే, మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై అప్పటి ప్రతిపక్షం, ప్రస్తుత అధికార కాంగ్రెస్ ప్రభుత్వం నానాయాగి చేసింది. తెలంగాణకు జలప్రదాయినిగా.. జీవధారగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుతో పాటు నేతలంతా తిప్పికొట్టారు. పిల్లర్ల కుంగుబాటును రెండునెలల్లో సరి చేసి నీళ్లివ్వొచ్చని స్పష్టం చేశారు. అయితే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహారం తీరు భిన్నంగా ఉండడంతో విమర్శలు గుప్పించారు. పిల్లర్లు కుంగినా.. కాఫర్ డ్యామ్ నిర్మించి.. నీటిని ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అయినా.. ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ప్రస్తుతం మేడిగడ్డ వద్ద పంపింగ్ను నిలిపివేయడంతో ఎండకాలంలో నీటి కొరత తీవ్రమైంది. పంటలు ఎండిపోవడంతో పాటు మంచినీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత మరోసారి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రైతు పొలంబాటకు శ్రీకారం చుట్టారు.
అయితే, ఇంతకు ముందు మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ, కాఫర్ డ్యామ్ నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని అంతకు ముందు ఎల్అండ్టీ సంస్థ పేర్కొంది. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్తోనే బ్యారేజీని నిర్మించామని.. అందులో లోపాలకు తాము బాధ్యులం కామన్న సంస్థ చెప్పింది. అయితే, మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేపట్టాల్సిందే నిర్మాణ సంస్థనేనని అప్పటి ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎల్అండ్టీ సంస్థ దిగివచ్చి పునరుద్ధరణ పనులు చేపడుతామని ముందుకువచ్చినట్లు తెలుస్తున్నది.