హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 23: కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్కు పాల్పడిన 83 మంది విద్యార్థులను హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు. పరిచయాల పేరిట జూనియర్లను సీనియర్ విద్యార్థులు అర్ధరాత్రి హాస్టల్ రూంలోకి పిలిచి వేధించారని జూనియర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు.
రైళ్లలో పల్లీలు అమ్ముకునే వారిలా నటించాలని, పాటలు పాడాలని, నృత్యాలు చేయాలని ర్యాగింగ్ చేసినట్టు వారు వాపోయారు. వారి ఫిర్యాదు మేరకు యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ జరిపింది. వారి నివేదిక మేరకు 83 మంది విద్యార్థులను వారం రోజులపాటు హాస్టల్ నుంచి సస్పెండ్ చేసినట్టు వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ తెలిపారు. ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో హెచ్చరించారు. కాగా, ఒకేసారి ఇంతమంది విద్యార్థులపై చర్యలు తీసుకోవడం యూనివర్సిటీ చరిత్రలో సంచలనంగా మారింది.