ప్రత్యేక కథనాలతో కాకతీయ వారసత్వం వెలికితీత
రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంతో ఓరుగల్లుకు బస్తర్ రాజు
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): కాకతీయుల చరిత్ర ప్రతాపరుద్రుడితోనే అంతం కాలేదని, వారి సామ్రాజ్యపు ఆనవాళ్లు బస్తర్లో ఉన్నాయని నమస్తే తెలంగాణ ఎనిమిదేండ్ల క్రితమే ఆధారాలతో నిరూపించింది. కాకతీయుల తొలి రాజధాని హనుమకొండ.. ఆ తరువాత ఓరుగల్లుగా ఎలా మారిందో, కాలక్రమంలో బస్తర్, ఆ తరువాత జగదల్పూర్ (ఛత్తీస్గఢ్)కు చేరిన నేపథ్యాన్ని తవ్వి తీసింది. చరిత్ర అధ్యయనానికి ఆధారమైన శాసన, పురావస్తు, వాంజ్మయ ఆధారాలను బ్రిటిష్, భారత ప్రభుత్వ గెజిట్లను క్రోడీకరించి బస్తర్లో ఉన్నది కాకతీయులేనని నిగ్గుతేల్చింది. 2014 సెప్టెంబర్ 15న ‘బస్తర్లో రెండో కాకతీయుల సామ్రాజ్యం’ అనే ప్రత్యేక కథనం సంచలనం సృష్టించింది. ఆ తరువాత ‘చరిత్ర పిలిచింది’ పేరుతో 2014 నవంబర్ 5న ఓరుగల్లు టు జగదల్పూర్, అదేరోజు ‘చెరగని చరిత్రకు సజీవ సాక్ష్యాలు’, 2014 నవంబర్ 6న ఇప్పటికీ ‘మహారాజే’, 2014 నవంబర్ 7న ‘ఆలయంలో ఆనవాళ్లు’ ఇలా వరుస కథనాలతో కాకతీయుల వారసత్వానికి వారధి కట్టించింది.
కాకతీయ వైభవం పేరుతో గురువారం నుంచి ఏడు రోజులపాటు వరంగల్, హైదరాబాద్లో ప్రత్యేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమాలకు బస్తర్ కాకతీయుల్లో 22వ మహారాజుగా అక్కడి ప్రజలు కీర్తిస్తున్న కమల్ చంద్ర భంజ్దేవ్ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించింది. స్వరాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వాన కాకతీయుల వైభవాన్ని పునరావిష్కరణ చేసుకొంటున్న తరుణంలో కమల్ చంద్ర భంజ్దేవ్ కాకతీయ తన 700 ఏండ్ల వెనుక పేగుబంధాన్ని వెతుక్కుంటూ రాష్ట్రంలో అడుగుపెడుతున్నారు. 2014 నవంబర్ 7న ‘ఓరుగల్లు చూడాలని ఉంది’ అనే శీర్షికతో ప్రచురితమైన కమల్చంద్ర భంజ్దేవ్ ఆకాంక్ష .. కాకతీయ సప్తాహం సందర్భంగా సాకారం అవుతుండటం విశేషం.