వరంగల్, జనవరి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ పాలనలో దేశంలోని దళితులు, ఆదివాసీలు, మైనారిటీకు ఒక్క మేలు చేయలేదని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు. దళిత, గిరిజనులను ఏ మాత్రం పట్టించుకోని బీజేపీకి, వారిని ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని స్పష్టంచేశారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్తోనే వారంతా ఉంటారని, వచ్చే ఎన్నికల్లోనూ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ సీట్లన్నీ టీఆర్ఎస్ గెలుచుకొంటుందని చెప్పారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎంపీ సీతారాంనాయక్తో కలిసి కడియం శ్రీహరి గురువారం హనుమకొండలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై దృషి ్టపెట్టినట్టు బీజేపీ నేతలు చెప్పుకొంటున్నారని, ఈ వర్గాల కోసం ఏం చేశారో ఆ పార్టీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడున్నరేండ్ల బీజేపీ పాలనలో దేశంలో అణగారిన వర్గాల సమస్యలు మరింత పెరిగాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను బీజేపీ నిర్లక్ష్యం చేస్తూ వివక్షకు గురిచేస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఫలాలు బలహీన వర్గాలకు అందకుండా రిజర్వేషన్లను ఎత్తివేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని, ఇందులో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతున్నదని మండిపడ్డారు. లాభాల్లో ఉన్న పరిశ్రమలను కూడా అమ్మేస్తున్నారని విమర్శించారు.
దేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు బీజేపీకి ఇప్పటికీ దూరంగానే ఉన్నారని, అనేక రాష్ర్టాల్లో బీజేపీని ఓడిస్తున్నారని కడియం శ్రీహరి తెలిపారు. త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల్లోనూ బీజేపీ ఘోరంగా ఓడిపోబోతున్నదని చెప్పారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో గెలుస్తామని బీజేపీ భ్రమపడుతున్నదని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని తేల్చిచెప్పారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి మేడారం సమ్మ క్క సారలమ్మ జాతరకు జాతీయహోదా ఎందుకు తేవడంలేదని ప్రశ్నించారు. ఆదివాసీలను పట్టించుకోకుండా వారి ఓట్లను ఎలా అడుతారని ప్రశ్నించారు. ఎస్సీ రిజర్వేషన్ పెంపుపై తాత్సారం చేస్తున్న బీజేపీకి ఆ వర్గాలు ఎందుకు మద్దతివ్వాలని ప్రశ్నించారు. ఏపీ విభజన చట్టంలో పెట్టిన ఏ ఒక్క హామీని అమలుచేయని బీజేపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహాం వ్యక్తంచేశారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పోడు భూములపై పోరాటం చేస్తామని బండి సంజయ్ అంటున్నారని, అటవీ చట్టాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయనే కనీస జ్ఞానం ఆయనకు లేదని ఎద్దేవా చేశారు. పోడు భూ ముల కోసమే అయితే ప్రధాని నరేంద్రమోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని సూచించారు.