ఆదిబట్ల, ఏప్రిల్ 2: ఓ భూవివాదం కేసులో కల్వకుంట్ల తేజేశ్వర్రావు అలియాస్ కన్నారావును మంగళవారం ఆదిబట్ల పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. ఆయనకు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. మార్చి 3న రంగారెడ్డి జిల్లా అబ్దులాపూర్మెట్ మండలం మన్నెగూడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 32లో 2.17 ఎకరాల స్థలం వివాదంలో ఆదిబట్ల పోలీసులు అప్పట్లో 38 మందిపై కేసు నమోదు చేశారు. అందులో ఏ4గా కన్నారావును చేర్చారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అప్పటి నుంచి కన్నారావు రెండుసార్లు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన బయటి ప్రాంతాలకు వెళ్లకుండా ముందుగానే పోలీసులు లుక్అవుట్ నోటీసు జారీ చేశారు. హైదరాబాద్లోని బాలాపూర్లో ఉన్న ఓ అడ్వకేట్ను కలవడానికి కన్నారావు మంగళవారం రావడంతో ఆదిబట్ల సీఐ రాఘవేందర్రెడ్డి తమ సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అయితే తానే పోలీసులకు సమాచారం ఇచ్చి లొంగిపోయినట్టు కన్నారావు తెలిపారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉన్నదని చెప్పారు.