సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 21: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లు, విదేశీ శక్తులకు జాతీయ ఆస్తులను అమ్ము తూ దేశానికి అన్యాయం చేస్తున్నదని సీఐటీయూ 4వ రాష్ట్ర మహాసభల్లో జాతీయ అధ్యక్షురాలు కే హేమలత అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ భవన్లో మూడు రోజుల పాటు జరిగే సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) 4వ రాష్ట్ర మహాసభలు బుధవారం ప్రారంభమయ్యాయి.
ఈ మహాసభలకు తెలంగాణ నలుమూలల నుంచి వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సీఐటీయూ అధ్యక్షురాలు హేమలత మాట్లాడుతూ.. 2024లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం సర్వ నాశనం అవుతుందని పేర్కొన్నారు. కార్మికరంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం లేబర్ కోడ్ తెచ్చిందని మండిపడ్డారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన లేబర్ కోడ్ను తీసుకొచ్చిందన్నారు. బీజేపీ అనుబంధ సంస్థలు లవ్ జిహాద్, గోరక్షణ పేరుతో మత ఘర్షణలు రేపుతున్నాయని మండిపడ్డారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాత్ర శూన్యమని విమర్శించారు. మహాసభల్లో అఖిల భారత సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్సేన్, రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు, వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.