హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా హైదరాబాద్తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ఆదివారం జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఘనంగా నివాళులర్పించారు. సామాజిక దార్శనికుడుగా, సంఘసంసర్తగా, వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటానికి బాటలు వేసిన క్రాంతికారుడు ఫూలే అని సీఎం స్మరించుకొన్నారు. వివక్షలేని సమానత్వ సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త జ్యోతిబా ఫూలే అని కొనియాడారు.
జ్యోతిబా ఫూలే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. సబ్బండవర్ణాల సాధికారత, సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. వెనకబడినవర్గాల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థను ఏర్పాటుచేసి, అన్ని నియోజకవర్గాల్లో బీసీ గురుకులాలు నెలకొల్పిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బాలికల కోసం ప్రత్యేక గురుకులాలను స్థాపించిందని, మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చర్యలు చేపట్టిందని చెప్పారు.
బలహీనవర్గాల విద్యార్థుల విదేశీ ఉన్నత విద్యాభ్యాసానికి ఫూలే బీసీ విదేశీ విద్యానిధి పథకం కింద ఒక్కొక్కరికి రూ.20 లక్షల వరకు ఆర్థికసాయం అందజేస్తున్నామని పేర్కొన్నారు. బహుజనుల కోసం ప్రత్యేకంగా ఆత్మగౌరవ భవనాలను నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం బీసీ వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని వివరించారు. వృత్తులవారీగా ప్రోత్సాహకాలు అందిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల సమగ్రాభివృద్ధి కోసం పాటుపడుతూ, వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని అన్నారు. ఫూలే ఆశయ సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వ కృషి నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.