హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభమైంది. జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసేట్టుగా ఏటా మూడురోజులపాటు ఈ జ్యేష్ఠాభిషేకం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. 1990లో ఈ ఉత్సవానికి శ్రీకారం చుట్టారు. తొలిరోజు ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణమండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం రుత్వికులు శాంతిహోమం నిర్వహించారు. శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం స్వామి, అమ్మవార్లకు అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం చేసి కంకణధారణ చేశారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సహస్రదీపాలంకార సేవ అనంతరం ఉత్సవమూర్తులు వజ్రకవచంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. గురువారం ముత్యపు కవచంతో, శుక్రవారం స్వర్ణకవచంతో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు. కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్న జీయర్స్వామి, టీటీడీ ఈవో జే శ్యామలరావు దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.