హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): కుటుంబ వివాదాల పరిష్కారంలో న్యాయమూర్తులు, న్యాయవాదులదే కీలక పాత్ర అని, ఇరుపక్షాల వాదనలు బేరీజు వేసి విజ్ఞతతో వివాదాలను పరిష్కరించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీ రామసుబ్రమణియన్ తెలిపారు. హైదరాబాద్ పురానాహవేలిలోని రాష్ట్ర పరిపాలనా ట్రైబ్యునల్ భవనాన్ని ఆధునీకరించి, అన్ని వసతులు కల్పించిన సమీకృత కోర్టు సముదాయం కల్పతరు’ను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్రమణియన్ మాట్లాడుతూ, కుటుంబ వివాదాల పరిష్కారాలకు కల్పతరు ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. దేశంలోని కుటుంబ కోర్టుల్లో 11.4 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని, కోర్టుల్లో లేని కేసులు కూడా అంతేస్థాయిలో ఉంటాయని వెల్లడించారు. తెలంగాణలో తొమ్మిది వేల కేసులు పెండింగ్లో ఉన్నట్టు చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్కుమార్ మాట్లాడుతూ కుటుంబ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఉండాలని 1958 నుంచి డిమాండ్ ఉన్నదని, అది 1984లో సాకారమైందని గుర్తు చేశారు. మరో 11 ఏండ్లకు ఉమ్మడి రాష్ట్రంలో తొలి ఫ్యామిలీ కోర్టు ఏర్పాటైందని తెలిపారు. దేశంలోనే అత్యద్భుతమైన కోర్టు సముదాయం హైదరాబాద్లో ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని చెప్పారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నర్సింహా మాట్లాడుతూ, ఏ సమాజమైనా నాగరికత కుటుంబ సంబంధాలపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. కుటుంబ వివాదాలు కూడా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేందుకు ఆసక్తి చూపే దశ వచ్చిందని చెప్పారు. వ్యక్తిగత విషయాలను న్యాయవాది ద్వారా కంటే వ్యక్తిగతంగా పరిష్కరించుకోవాలనే వారి సంఖ్య పెరుగుతున్నదని వెల్లడించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మాట్లాడుతూ, మీడియేషన్ సెంటర్, మనో వికాస కేంద్రం, ధ్యాన కేంద్రం, పిల్లలు ఆడుకోవటానికి ప్రత్యేక ఏర్పాట్లు వంటివి కల్పతరులో ఉన్నాయని తెలిపారు. న్యాయమూర్తి జస్టిస్ పీ నవీన్రావు మాట్లాడుతూ ఫ్యామిలీ కోర్టుల సముదాయం అన్ని హంగులతో ఏర్పాటైందని, ఇందుకు సహకరించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు సీజే ఇతరులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, ఏజీ బీఎస్ ప్రసాద్, నల్సార్ వర్సిటీ వీసీ శ్రీకృష్ణదేవరావు, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్రావు, లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి గోవర్ధన్రెడ్డి ఇతరులు పాల్గొన్నారు.
దేశంలోనే తొలి అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్
జనగాం జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో అగ్రి లీగల్ ఎయిడ్ క్ల్లినిక్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ ప్రారంభించారు. దేశంలోనే తొలి అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ను ఆన్లైన్ విధానంలో ప్రారంభించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, నల్సార్ విశ్వవిద్యాలయం, లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్) సంయుక్తంగా ఈ కేంద్రాన్ని ప్రారంభించాయి. దుక్కి దున్నటం మొదలు పంట చేతికి వచ్చాక మార్కెట్లో అమ్మటం వరకు అన్ని దశల్లోనూ రైతులకు ఉపయుక్తంగా ఉండేలా ప్రభుత్వం చట్టాలు చేసిందని లీఫ్స్ అధ్యక్షుడు సునీల్ కుమార్ చెప్పారు. న్యాయపరమైన సాయాన్ని ఈ క్ల్లినిక్ అందజేస్తుందని తెలిపారు.