హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం సింగపూర్
ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్ (ఎస్ఐఎంసీ) ప్యానెల్ సభ్యుడిగా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి
జస్టిస్ ఎన్వీ రమణ నియమితులయ్యారు. సింగపూర్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో నియామక
పత్రాన్ని ఎస్ఐఎంసీ చైర్మన్ జార్జ్ లిమ్ అందజేశారు.
సింగపూర్ న్యాయశాఖ ఆధ్వర్యంలో 20కి పైగా భాగస్వామ్య సంస్థలు అక్కడ నిర్వహించిన వార్షిక సమావేశం ‘సింగపూర్ కన్వెన్షన్ వీక్’లో జస్టిస్ రమణ పాల్గొని నాలుగు ప్రముఖ భారతీయ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆయన చొరవతో మధ్యవర్తిత్వ విధానానికి మద్దతు ఇచ్చేందుకు టాటా, రిలయన్స్, మహీంద్రా, ఆదిత్య బిర్లా గ్రూప్కు చెందిన భారతీయ కార్పొరేట్ సంస్థలు ‘డిక్లరేషన్ ఆఫ్ ఇంటెంట్’పై సంతకం చేయడానికి ముందుకు వచ్చాయి.