హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరధేను నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి, రాష్ట్రపతికి నివేదించింది. దీనిని రాష్ట్రపతి బుధవారం ఆమోదించారు. ఇప్పటివరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం తాతాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అభినంద్కుమార్ షావిలి వ్యవహరిస్తున్నారు. జస్టిస్ అరధే తెలంగాణ హైకోర్టు ఏర్పడిన తరువాత ఆరో సీజే అవుతారు. జస్టిస్ అలోక్ అరధే మధ్యప్రదేశ్లోని రాయ్పూర్లో 1964 ఏప్రిల్ 14న జన్మించారు. బీఎస్సీ, ఎల్ఎల్బీ పూర్తిచేసిన తరువాత 1988లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2007లో సీనియర్ న్యాయవాది అయ్యారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో రాజ్యాంగం, మధ్యవర్తిత్వం, కంపెనీ చట్టాలకు సంబంధించిన కేసులు వాదించడంలో పేరు సంపాదించారు. 2009 డిసెంబర్లో మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ అరధే.. కశ్మీర్, కర్ణాటక హైకోర్టుల్లో న్యాయమూర్తిగానూ, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగానూ వ్యవహరించారు.
న్యాయమూర్తిగా పీ సామ్కోశాయ్
ఇదిలా ఉండగా, ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుభాసిస్ తలపత్రా, గుజరాత్ హైకోర్టు సీజేగా జస్టిస్ సునీతా అగర్వాల్, కేరళ హైకోర్టు సీజేగా జస్టిస్ అశిష్ జితేంద్రదేశాయ్కు పదోన్నతి లభించింది. ఛత్తీస్గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ సామ్కోశాయ్ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బది లీ అయ్యారు. ఈ బదిలీల గురించి కేంద్ర న్యాయ శాఖమంత్రి అర్జున్ రాంమేఘ్వాల్ బుధవారం ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. వీరిద్దరి రాకతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 28కి చేరుతుంది. జస్టిస్ కన్నెగంటి లలిత కర్ణాటక హైకోర్టుకు బదిలీ ఉత్తర్వులు అమలైతే ఆ సంఖ్య 27కి వస్తుంది.