హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ న్యాయవాది చాడ విజయభాస్కర్రెడ్డిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీచేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో గురువారం విజయభాస్కర్రెడ్డితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ చేయించనున్నారు. 12 మంది న్యాయవాదులకు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం గత ఫిబ్రవరిలో కేంద్రానికి సిఫార్సు చేసింది. అప్పుడు పది ంమందికి నాటి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. అప్పటి నుంచి పెండింగ్లో ఉన్న ఇద్దరిలో ఒకరికి ఇప్పుడు పదోన్నతి లభించింది. ప్రస్తుతం హైకోర్టులో సీజేతో కలిపి 27 మంది న్యాయమూర్తులు ఉన్నారు. చాడ ప్రమాణంతో వీరి సంఖ్య 28కి చేరనుంది. గత వారం సుప్రీంకోర్టు కొలీజియం మరో ఆరుగురిని న్యాయమూర్తులుగా సిఫారసు చేసింది. వీరికి కూడా రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే ఆ సంఖ్య 34కు పెరుగుతుంది. అప్పుడు ఇంకా 8 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీలు ఉంటాయి.
ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాకలో పుష్పమ్మ, కేశవరెడ్డి దంపతులకు 1968, జూన్ 28న చాడ విజయభాస్కర్రెడ్డి జన్మించారు. వీరిది సాధారణ వ్యవసాయ కుటుంబం. దుబ్బాకలో పాఠశాల విద్య, హైదరాబాద్లోని జీ పుల్లారెడ్డి కాలేజీలో ఇంటర్మీడియట్, సైన్స్ కాలేజీలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ చేశారు. 1992, డిసెంబర్ 31న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. జస్టిస్ వీవీఎస్ రావు దగ్గర జూనియర్గా పనిచేశారు 1999లో ఎన్ఐఆర్డీ, స్మాల్స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. 2006 నుంచి 2009 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నారు. 2010-15 మధ్య కాలంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్గా చేశారు. 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిగా ఉంటూ ఇప్పుడు న్యాయమూర్తిగా ప్రమాణం చేయనున్నారు.