హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో గ్లోబల్ లీడర్గా ఉన్న జుబిలెంట్ భార్టియా గ్రూప్ హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. పరిశోధనా సంస్థలకు అవసరమైన సేవలను ఈ కేంద్రం అందించనున్నది. ఔషధాలు, కాంట్రాక్ట్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సేవలు, ప్రొప్రైటరీ నావల్ డ్రగ్స్, లైఫ్ సైన్సెస్ ఇంగ్రీడియంట్స్, వ్యవసాయోత్పత్తులు, పెర్ఫార్మెన్స్ పాలిమర్స్, ఫుడ్ సర్వీస్ (క్యూఎస్ఆర్), ఫుడ్, ఆటో, కన్సల్టింగ్ ఇన్ ఏరోస్పేస్, ఆయిల్ ఫీల్డ్ సర్వీసెస్ వంటి విభిన్న రంగాల్లో ఈ గ్రూపు సేవలందిస్తున్నది. జుబిలెంట్ ఫార్మోవా లిమిటెడ్, జుబిలెంట్ ఇంగ్రేవియా లిమిటెడ్, జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్, జుబిలెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి ప్రధాన కంపెనీలను నిర్వహిస్తున్నది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీల్లో 46 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. బయోఏషియా-2023 లో భాగంగా శనివారం హెచ్ఐసీసీలో జుబిలెంట్ భార్టియా గ్రూప్ వ్యవస్థాపకుడు, కో-చైర్మన్ శ్రీహరి భార్టియా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావుతో భేటీ అయిన అనంతరం తమ పెట్టుబడి వివరాలను వెల్లడించారు.
కొన్నేండ్లుగా హైదారాబాద్ నగరం బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగంలో భారీగా పెట్టుబడులు ఆకర్షిస్తూ ఈ రంగాలకు ప్రధాన కేంద్రంగా మారిందని శ్రీహరి భార్టియా తెలిపారు. బయోటెక్నాలజీ, లైఫ్సైన్సెస్కు అవసరమైన పర్యావరణ వ్యవస్థ, పరిశ్రమ అనుకూల విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభగల ఉద్యోగులు, వ్యాపార- స్నేహపూర్వక ప్రభుత్వం ఉండటంతో ప్రముఖ కంపెనీలు ఇక్కడ ఏర్పాటయ్యాయని అన్నారు. తమ కంపెనీ జుబిలెంట్ బయోసిస్ సైతం సమీప భవిష్యత్తులో జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక సౌకర్యాల కేంద్రా న్ని ఏర్పాటు చేయనున్నదని వివరించారు.
జుబిలెంట్ గ్రూప్ జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించటం సంతోషదాయకమని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో అద్భుత లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలకు ఉపయోగపడే నైపుణ్యం ఉన్నాయనడానికి ఈ పెట్టుబడులు మరో నిదర్శనమని పేర్కొన్నారు. జుబిలెంట్ ప్రవేశంతో భారతదేశంలోని అన్ని ప్రధాన కాం ట్రాక్ట్ రిసెర్చ్ సంస్థల(సీఆర్వో)కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుందనడంలో సందే హం లేదని అన్నారు. నగరం ‘లైఫ్ సైన్సెస్ రిసెర్చ్ క్యాపిటల్’గా అవతరించనున్నదని తెలిపారు. జుబిలెంట్కు అన్ని రకాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
బయోఏషియా సదస్సులో భాగంగా శుక్రవారం నిర్వహించిన బృంద చర్చలో మంత్రి కేటీఆర్తో భార్టియా కలిసి పాల్గొన్నారు. ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధిలో హైదరాబాద్ నగరం ఇప్పటికే ప్రధాన కేంద్రంగా ఉన్నది. యూరోఫిన్స్, క్యూరియా, సాయి లైఫ్సైన్సెస్, అరాజెన్ లైఫ్సైన్సెస్, సింజీన్ ఇంటర్నేషనల్ తదితర ప్రపంచ శ్రేణి కంపెనీలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. తాజాగా జుబిలెంట్ జోడింపుతో దేశంలో సీఆర్వోల హబ్గా హైదరాబాద్ స్థితిని మరింత పటిష్ఠం చేస్తుందనడంలో సందేహం లేదు. కొత్త ఔషధాలు, పరికరాలను అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా 1000 కిపైగా ఆవిష్కర్తలకు నగరం సేవలు అందిస్తున్నది. నోవార్టిస్, ఫెర్రింగ్ ఫార్మా, కీమో, డుపాంట్, ఆష్ల్యాండ్, యునైటెడ్ స్టేట్స్ ఫార్మకోపియా, లోంజా వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు నగరంలో ఉన్నాయి. జీనోమ్ వ్యాలీలో ఇప్పటికే 200 కంపెనీలు కొలువుదీరగా, 15,000 మందివరకూ నైపుణ్యంగల సిబ్బంది పనిచేస్తున్నారు.