నిర్మల్ : తెలంగాణపై అవినీతి ఆరోపణలు చేస్తున్న బీజెపీ జాతీయ, రాష్ట్ర నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని సారంగాపూర్లో జరిగిన రైతుబంధు ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాధ్యత గల పదవిలో ఉన్న జేపీ నడ్డా మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారని విమర్శించారు.
రైతుబంధు, రైతు బీమా తోపాటు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది పలు అవార్డులు సాధించిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధితో పాటు ప్రజల నుంచి టీఆర్ఎస్ కు లభిస్తున్న మద్దతు చూసి ఓర్వలేక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తున్నామంటున్న జేపీ నడ్డా 70 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టి వాటిపై ఆధారపడిన లక్షల మందిని ఆందోళన చేస్తున్న ఎందుకు స్పందించడం లేదన్నారు.
ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా పాలసీ కాకుండా సెల్ ఇండియా పాలసీ అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ఇచ్చిన రెండు వేల కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. జేపీ నడ్డా కాళేశ్వరం మిషన్ భగీరథ ఇలాంటి పథకాలపై వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రాజెక్టు అభివృద్ధి డిస్కవరీ ఛానల్ లో సైతం ప్రసారమైన విషయాన్ని బీజేపీ నేతలు గమనించాలని సూచించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల నీరు అందుతుందని, ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు.
కరోనా నిబంధనలు ఉల్లంఘించి అనుమతిలేని దీక్ష చేపట్టిన బండి సంజయ్ పోలీసుల పై దాడులు చేశారని, చట్టం ప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటున్నారన్నారు.
జైల్లో బండి సంజయ్ పరామర్శిస్తున్న కేంద్ర మంత్రులు ఢిల్లీలో రైతులను కారుతో తొక్కి చంపిన రైతు కుటుంబాలు ఎందుకు పరామర్శించ లేదన్నారు. బీజేపీ నాయకులు రాజకీయాలు మానుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు.