హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సాక్షిగా బీజేపీ కేంద్ర కార్యాలయంలో జర్నలిస్టులకు అవమానం జరిగింది. శనివారం సాయంత్రం కేంద్ర మంత్రి నిర్వహించిన ప్రెస్మీట్కు మీడియాను ఆహ్వానించారు. ఇందులో భాగంగా నమస్తే తెలంగాణ, టీన్యూస్, తెలంగాణ టుడే ప్రతినిధులు సైతం హాజరయ్యారు. అయితే, సమావేశం ప్రారంభించడానికి ముందే నమస్తే తెలంగాణ, టీ న్యూస్, తెలంగాణ టుడేకు చెందిన విలేకరులు బయటికి వెళ్లిపోవాలంటూ ఆదేశించారు. ఎందుకు? అని ప్రశ్నించినా సమాధానం ఇవ్వలేదు. జర్నలిస్టులు కార్యాలయం బయటికి వెళ్లేదాకా ప్రెస్మీట్ను నిలిపివేశారు. వారు గేటు దాటారని సీసీ కెమెరాల్లో చూసి నిర్ధారించుకున్న తర్వాతే కేంద్ర మంత్రి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రెస్మీట్ హాల్లోకి వచ్చారు. ఆ వెంటనే తలుపులు మూసేశారు. ప్రెస్మీట్ ప్రారంభించిన తర్వాత బండి సంజయ్ సైతం ‘ఆ మీడియా చానళ్ల ప్రతినిధులు ఉంటే బయటికి వెళ్లిపోవాలి’ అని మరోసారి సూచించారు. జర్నలిస్టులకు జరిగిన అవమానంపై జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి.
తెలంగాణ మీడియాను అవమానపరిచేలా వ్యవహరించిన బీజేపీ తీరుపై మేధావులు, పాత్రికేయులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పనిగట్టుకొని కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులను బయటకు వెళ్లాలని చెప్పడంపై మండిపడుతున్నారు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని వారు మీడియా సమావేశాలు ఎందుకు నిర్వహిస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రశ్నలకు జవాబు చెప్పలేకనే బీజేపీ ఇలాంటి చర్యలకు దిగుతున్నదని ఎద్దేవా చేస్తున్నారు. మీడియా సమావేశంలో బీజేపీ నేతలు వ్యవహరించిన తీరుపై న్యూస్మీటర్ పాత్రికేయురాలు కరీనా ఎనెట్ సారస్ ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తంచేశారు. కొన్ని మీడియా సంస్థలను బయటకు పంపడమేగాక సమావేశంలో ఉన్న మిగతా మీడియాను కూడా అవమానించేలా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రశ్నలు అడిగే ముందు జర్నలిస్టు పేరును, మీడియా సంస్థ పేరును చెప్పాలని షరతులు పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
తెలంగాణలో కేంద్ర మంత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మీడియా స్వేచ్ఛను హరించేలా, జర్నలిస్టులను అవమానపరిచేలా వ్యవహరించిన బీజేపీ తీరుపై తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్టు సంఘం మండిపడింది. సమావేశానికి తెలుగు మీడియా మొత్తం హాజరు కాగా కేవలం నమస్తే తెలంగాణ, టీ న్యూస్, తెలంగాణ టుడే ప్రతినిధులను బయటకు వెళ్లాలని చెప్పడం తెలంగాణ మీడియాను అవమానపరిచినట్టేనని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆసాని మారుతీసాగర్, తెంజు రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి రమణకుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మొదట సమావేశానికి హాజరు కావాలని గ్రూప్ మెసేజ్ల ద్వారా ఆహ్వానం పంపి.. తీరా వచ్చాక బయటకు వెళ్లాలని అగౌరవంగా వ్యవహరించడం ఒక జాతీయ పార్టీగా బీజేపీకి తగదని హితవు పలికారు. మీడియా ప్రతినిధులకు బీజేపీ శ్రేణులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.