హైదరాబాద్ : అక్రిడిటేషన్ల విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో 252తో తమకు అన్యాయం జరుగుతుందని డెస్క్ జర్నలిస్టులు గడిచిన వారం రోజులుగా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరుతూ.. టీడబ్ల్యూజేఎఫ్, డీజేఎఫ్టీ నేతలు మంగళవారం సమాచార, ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు.
డెస్క్ జర్నలిస్టులకు గతంలో లాగే అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని, జీవో 252 ని సవరించాలని మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లారు. స్పోర్ట్స్, కల్చరల్, ఫీచర్ ప్రతినిధులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని ఫెడరేషన్ నేతలు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టు సంఘాల వినతిపై మంత్రి పొంగులేటి కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
రిపోర్టర్లతోపాటు డెస్క్ జర్నలిస్టులకు అన్ని సౌకర్యాలు ఉంటాయని, డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి అపోహలు పడొద్దని ఆయన చెప్పినట్లు తెలిసింది. త్వరలోనే జర్నలిస్టు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి, వారి అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తానని కూడా చెప్పినట్లు సమాచారం. జర్నలిస్టులకు ఇబ్బంది లేకుండా జీవో 252ను సవరిస్తామని మంత్రి చెప్పనట్లు తెలుస్తోంది.